న్యూఢిల్లీ : సాధారణ మహిళలు తమకు న్యాయం చేయాలంటూ కోర్టులను ఆశ్రయిస్తారు. అటువంటిది తన జీవితాన్ని గౌరవ ప్రదంగా ముగించేందుకు అనుమతించండి అని యుపికి చెందిన ఓ జడ్జి లేఖ రాశారంటే పరిస్థితి ఏమిటి.. మహిళలకు ఎక్కడ న్యాయం లభిస్తుంది..
సోషల్ మీడియాలో వైరలైన ఆ లేఖపై సుప్రీంకోర్టు చీఫ్ జస్టీస్ డివై. చంద్రచూడ్ శుక్రవారం స్పందించారు. చీఫ్ జస్టిస్ ఆదేశాల మేరకు మహిళా జడ్జి చేసిన ఫిర్యాదులపై నివేదిక ఇవ్వాలని సుప్రీంకోర్టు సెక్రటరీ జనరల్ అతుల్ ఎం. కర్హేకర్ అలహాబాద్ హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్కు లేఖ రాస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ బహిరంగ లేఖను హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి దృష్టికి కూడా వెళ్లినట్లు సెక్రటరీ జనరల్ పేర్కొన్నారు.
”నా జీవితాన్ని గౌరవప్రదంగా ముగించుకోవడానికి నన్ను అనుమతించడండి. నాజీవితాన్నిఅంతం చేసుకోనివ్వండి ” అని బందాకు చెందిన ఓ మహిళా న్యాయమూర్తి చీఫ్ జస్టిస్ను సూచిస్తూ రాసిన బహిరంగ లేఖ సోషల్మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. బారాబంకిలో పనిచేస్తున్న సమయంలో జిల్లా జడ్జి అతని సహచరులులైంగిక వేదింపులకు పాల్పడ్డారని పేర్కొన్నారు. నేను చాలా తీవ్రంగా లైంగిక వేధింపులకు గురయ్యాను. నన్ను పురుగుకంటే హీనంగా చూస్తున్నారు. గౌరవప్రదంగా నా జీవితాన్ని అంతం చేసుకునేందుకు అనుమతించండి ” అని ఆ లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు.
2023 జులైలో తాను హైకోర్టు అంతర్గత ఫిర్యాదుల కమిటీకి ఫిర్యాదు చేశానని, విచారణకు ఆదేశించారని అయితే ఆ విచారణ ఓ ”ప్రహసనం, బూటకం” అని పేర్కొన్నారు. సాక్షులు జిల్లా జడ్జికి సబార్డినేట్లని, తమ యజమానికి వ్యతిరేకంగా సాక్ష్యమిస్తారని కమిటీ ఎలా భావించింది. ఇది నా అవగాహనకు కూడా అందడం లేదు ” అని పేర్కొన్నారు. న్యాయమైన విచారణ కోసం దర్యాప్తు పూర్తయ్యేంతవరకు అతనిని బదిలీ చేయాలని సుప్రీంకోర్టును కోరానని, అయితే కేవలం ఎనిమిది సెకండ్లలలో తన పిటిషన్ను సుప్రీంకోర్టు తిరస్కరించిందని తెలిపారు. తనకు జీవించాలనే కోరిక లేదని, గత ఏడాదిన్నరకాలంగా తనను నడిరోడ్డుపై పడేశారని, ప్రాణంలేని, నిర్జీవమైన ఈ శరీరాన్ని ఇకపై మోయడం వల్ల ప్రయోజనం లేదని, తన జీవితానికి ఎలాంటి లక్ష్యం లేదని రెండు పేజీల సుదీర్ఘ లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు.