లక్నో : ఈ కాలంలో రోజురోజుకీ చలితీవ్రత మరింత పెరుగుతోంది. గత కొన్నిరోజులుగా దేశ రాజధానిని చలి వణికిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే ఉత్తరప్రదేశ్లో కూడా చలి తీవ్రత ఎక్కువగా ఉంది. దీంతో ఆ రాష్ట్రంలోని పలు జిల్లాల్లోని పాఠశాలలకు విద్యాశాఖ శీతాకాలపు సెలవులను ప్రకటించింది. విపరీతమైన చలికి చిన్నారులు తట్టుకోలేని కారణంగా ఘజియాబాద్లోని అన్ని పాఠశాలలను ఈ నెల 14 వరకు మూసివేయాలని విద్యాశాఖ తాజాగా ఆదేశాలు జారీ చేసింది. జలౌన్ జిల్లాలో జనవరి 6 వరకు ప్రభుత్వ, ప్రభుత్వేతర పాఠశాలలను మూసివేయాలని జిల్లా మెజిస్ట్రేట్ ఆదేశాలు జారీ చేసింది. అలాగే ప్రయాగ్రాజ్ జిల్లాలోనూ ఒకటి నుంచి 8వ తరగతి వరకు అన్ని ప్రభుత్వ, ప్రభుత్వేతర, గుర్తింపు పొందిన పాఠశాలలు మూసివేయాలని అధికారులు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇక వేసవికాలంలో మాదిరిగా.. ఈ కాలంలో పెరుగుతున్న చలి, దట్టమైన పొగమంచు దృష్ట్యా వారణాసి జిల్లా మెజిస్ట్రేట్ పాఠశాల సమయాలను మార్చారు. జనవరి 2 (మంగళవారం) నుంచి 6 వరకు అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటలవరకు మాత్రమే నిర్వహించాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు.
![](https://prajasakti.com/wp-content/uploads/2024/01/up-schools-copy.jpg)