సీఎం జగన్‌కు వైఎస్‌ షర్మిల సంచలన లేఖ.. అందులో ఏముందంటే..

Feb 7,2024 16:05 #ap cm jagan, #letter, #ys sharmila

అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ పీసీసీ చీఫ్‌గా పదవీ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి వైఎస్‌ షర్మిల చాలా దూకుడు ప్రదర్శిస్తున్నారు. ముఖ్యంగా తన అన్న, ముఖ్యమంత్రి జగన్‌పై ఓ రేంజ్‌లో ఫైర్‌ అవుతున్నారు. ప్రజా సమస్యలపై, ప్రభుత్వ నిర్ణయాలపై తనదైన శైలిలో విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా ఆమె సీఎం జగన్‌ తీరును తూర్పారబడుతూ బహిరంగ లేఖ రాశారు. రాష్ట్ర హక్కుల సాధన విషయంలో ప్రభుత్వ అనుసరిస్తున్న తీరును ఆమె విమర్శించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం అవసరమైతే కేంద్రంపై ఉమ్మడి పోరాటానికి సిద్ధమవ్వాలని ఇటు సీఎం జగన్‌, అటు ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడిని డిమాండ్‌ చేశారు.’ఆంధ్రప్రదేశ్‌ విభజన హామీల అమలు 5.5 కోట్ల ప్రజల హక్కు. వాటిని విస్మరించి, నిర్లక్ష్యం చేసి, రాష్ట్రాన్ని ఇంకా మోసం చేస్తూనే ఉంటే కాంగ్రెస్‌ చూస్తూ ఊరుకోదు. ఇందులో భాగంగా, విభజన హామీలు గుర్తు చేస్తూ కేంద్రంపై కలిసిపోరాడాలని ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డికి, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుకి బహిరంగ లేఖలు రాశారు. హామీలపై అసెంబ్లీలో ‘ఆంధ్ర రాష్ట్ర ప్రజల హక్కు’ తీర్మానం చేసి కేంద్రానికి, రాష్ట్రపతికి పంపాలని ఈ లేఖల్లో మా డిమాండ్‌ ముందుంచాము. అలాగే యావత్‌ అసెంబ్లీ సభ్యులకు ఇదే నా మనవి. కలసి పోరాడదాం, మీ మీ పార్టీల తరుపున అసెంబ్లీ వేదికగా ఈ చర్చ కొనసాగించండి, అసెంబ్లీ తీర్మానానికి పట్టుబట్టండి. ఇది రాజకీయాలకతీతంగా అందరం చేయాల్సిన పోరు.’ అని లేఖలో పేర్కొన్నారు వైఎస్‌ షర్మిల.’ఆంధ్రప్రదేశ్‌ విభజన అనంతరం గడిచిన పదేళ్లలో అటు కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో మొదటి ఐదేళ్లు టీడీపీ, ఇప్పుడు వైసీపీ పూర్తి మెజారిటీతో అధికారంలో ఉన్నా పునర్విభజన చట్టంలో పొందుపరిచిన హామీలు ఒక్కటంటే ఒక్కటి కూడా పూర్తి స్థాయిలో అమలుకు నోచుకోకపోవడం దురదృష్టకరం, అత్యంత బాధాకరం. నాడు తెలంగాణ ఏర్పాటులో భాగంగా విభజిత ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ఎక్కువ నష్టం జరగకుండా అభివృద్ధి, పునర్నిర్మాణం అత్యంత వేగంగా జరగాలనే ఉద్దేశ్యంతో, ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్టం 2014లో ప్రత్యేక హౌదా సహా పోలవరానికి జాతీయ హౌదా వంటి ముఖ్యమైన హామీలు పొందుపరచటం జరిగింది. కానీ విభజన అనంతరం కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన బీజేపీ ఆ హామీలను పూర్తిగా పక్కన పెట్టేసింది. నాడు బీజేపీతో పొత్తులో ఉన్న టీడీపీ పార్టీ, ఐదున్నర కోట్ల ప్రజల ఆశలను, ఆశయాలను తీర్చే హామీలను సాధించుకోవడానికి పోరాటం చేయలేదు. ఏపీ ప్రజలకు ఆనాడు మీరు చేసిన అన్యాయానికి మేము చింతిస్తున్నాం. రాష్ట్రానికి జరిగిన చారిత్రక అన్యాయాన్ని సరి చేస్తామనే వాగ్దానంతో 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చింది. కానీ, పరిస్థితిలో ఎలాంటి మార్పు రాలేదు. ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉంది.’ అంటూ తీవ్రస్థాయిలో ఫైర్‌ అయ్యారు. తన లేఖలో అమలు కాని విభజన హామీలు అని కొన్ని అంశాలను వైఎస్‌ షర్మిల ప్రస్తావించారు. పోలవరం ప్రాజెక్టు జాతీయ హోదా, విశాఖ కేంద్రంగా నూతన రైల్వే జోన్‌, రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాలకు వెనుకబడిన ప్రాంతాలకు నిధులు, కడపలో ఉక్కు ఫ్యాక్టరీ, విశాఖ-చెన్నై పారిశ్రామిక కారిడార్‌, కొత్త రాజధాని నగర నిర్మాణం. ఇవి కాకుండా భవిష్యత్తు కోసం విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ ప్రతిపాదనను తీవ్రంగా ప్రతిఘటించాల్సిన అవసరం ఉందని షర్మిల తన లేఖలో పేర్కొన్నారు.

➡️