– కంచాలను మోగిస్తూ అంగన్వాడీల నిరసన
ప్రజాశక్తి – యంత్రాంగం: గౌరవ వేతనం మాకొద్దు.. కనీస వేతనాలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సమ్మె శిబిరాల వద్ద కంచాలను మోగిస్తూ అంగన్వాడీలు నిరసన తెలిపారు. సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్న వారి సమ్మె మంగళవారం నాటికి 15వ రోజుకు చేరుకుంది. శ్రీకాకుళం జిల్లా పొందూరులో సమ్మెకు సంఘీభావం తెలిపిన గర్భిణులు, బాలింతలు తమ చిన్నారులతో కలిసి గరిటెలతో పళ్లాలు మోగించారు. విజయనగరం జిల్లా, పార్వతీపురం మన్యం జిల్లా అంతటా ఖాళీ ప్లేట్లు మోగిస్తూ నిరసన తెలిపారు. విజయనగరంలో ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు పి.రఘువర్మ, వి.చిరంజీవి మద్దతు తెలిపారు. నెల్లూరు ఐసిడిఎస్ పిడి కార్యాలయం వద్ద ధర్నా చేశారు. అనంతపురం జిల్లా పరిధిలోని పుట్లూరులో వేప ఆకులు తింటూ నిరసన తెలిపారు. అనంతపురం కలెక్టరేట్ వద్ద భిక్షాటన చేశారు. బాపట్లలో నల్ల బెలూన్లతో నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఉమ్మడి కడప, ఒంగోలులో ప్లేట్లు మోగిస్తూ నిరసన తెలిపారు. తూర్పుగోదావరి జిల్లాలో అంగన్వాడీలకు మద్దతుగా ఆశా వర్కర్లు ర్యాలీ నిర్వహించారు. ఎపి ఆశా వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు కె.పోచమ్మ ఆధ్వర్యంలో చాగల్లు తహశీల్దార్కు వినతిపత్రం అందించారు. కర్నూలు ధర్నాచౌక్లో పొర్లు దండాలతో అంగన్వాడీలు నిరసన తెలిపారు. నంద్యాల జిల్లా వ్యాప్తంగా తహశీల్దార్ కార్యాలయాలు ఎదుట ప్లేట్లను మోగిస్తూ నిరసన తెలిపారు.విశాఖలోని జివిఎంసి గాంధీ విగ్రహం వద్ద ధర్నా నిర్వహించారు. గాజువాక నియోజకవర్గంలోని మిందిలో ఉంటున్న మంత్రి అమర్నాథ్ను అంగన్వాడీ కార్యకర్తలు కలిసి తమ సమస్యలపై వినతిపత్రం అందించారు. అనకాపల్లి జిల్లా పరవాడలో ఆడుదాం ఆంధ్రా కార్యక్రమం ప్రారంభానికి పెందుర్తి ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్రాజ్ వచ్చిన సందర్భంగా అంగన్వాడీలు దీక్షా శిబిరం నుంచి అక్కడకు వెళ్లి నిరసన తెలిపారు. ఆయనకు వినతిపత్రం అందజేశారు. అల్లూరి జిల్లాలోని అన్ని మండలాల్లో కంచాలు మోగిస్తూ నిరసన తెలిపారు. చింతూరు వద్ద శబరి నదిలో దిగి వినూత్నంగా నిరసన తెలియజేశారు.ఎన్టిఆర్ జిల్లా విజయవాడ ధర్నా చౌక్లో ప్లేట్లు మోగించి నిరసన తెలిపారు. మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ఉమామహేశ్వరరావు, ఆంధ్రప్రదేశ్ పట్టణ పౌర సమాఖ్య కన్వీనర్ సిహెచ్. బాబూరావు, యూనియన్ రాష్ట్ర కార్యదర్శి కె.సుబ్బారావమ్మ, ఇతర నేతలు మద్దతు తెలిపి మాట్లాడారు. సమ్మెను అణిచి వేయాలని రాష్ట్ర ప్రభుత్వం చూస్తోందని, ఇటువంటి చర్యను తిప్పికొట్టాలని కోరారు. సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు దోనేపూడి కాశీనాథ్ మద్దతు తెలిపారు.పశ్చిమగోదావరి జిల్లాలో కంచాలను గరిటెలతో కొడుతూ నిరసన తెలిపారు. యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి బి.గోపీమూర్తి సంఘీభావం తెలిపారు. ఏలూరు జిల్లా భీమడోలులో ఒంటికాలిపై నిలబడి గరిటెలతో కంచాలను మోగిస్తూ నిరసన తెలిపారు.గుంటూరు కలెక్టరేట్ ఎదుట ధర్నా తెలిపారు. పల్నాడు జిల్లా యడ్లపాడులో పిఆర్ విజ్ఞాన కేంద్రం నుండి జాతీయ రహదారి వరకూ ఖాళీ కంచాలు మోగిస్తూ ప్రదర్శన చేశారు. అమరావతిలో అంబేద్కర్ విగ్రహం ఎదుట మానవహారంగా ఏర్పడి కంచాలు మోగించారు.మీరు టెస్ట్రాసి రాలేదు : అంగన్వాడీల పట్ల ప్రభుత్వ విప్ ధర్మశ్రీ వ్యాఖ్యలుఅనకాపల్లి జిల్లా చోడవరం తహశీల్దారు కార్యాలయం వద్ద రిలే దీక్షలు చేస్తున్న అంగన్వాడీ కార్యకర్తలు… అటువైపు వెళుతున్న ప్రభుత్వ విప్, చోడవరం శాసనసభ్యులు కరణం ధర్మశ్రీని అడ్డగించారు. తమ సమస్యలు పరిష్కరించే వరకు కదిలేది లేదని బీష్మించారు. దీంతో కారు దిగి శిబిరం వద్దకు వచ్చిన ధర్మశ్రీ మాట్లాడుతూ ‘ప్రభుత్వ ఉద్యోగులు మాదిరిగా మీకు సదుపాయాలు కల్పించడానికి మీరు టెస్ట్ రాసి వచ్చిన వారు కాదు. గౌరవ వేతనానికి నియమింపబడ్డ కార్యకర్తలు. ఆ విధంగానే మిమ్మల్ని ప్రభుత్వం పరిగణిస్తుంది. తక్షణమే దీక్ష విరమించి విధుల్లోకి హాజరుకండి. లేకుంటే మిమ్మల్ని ప్రభుత్వం విధులు నుంచి తప్పిస్తుంది’ అని హెచ్చరించారు. ఆయన వ్యాఖ్యలను వ్యతిరేకించిన అంగన్వాడీ కార్యకర్తలు పెద్ద పెట్టున నినాదాలు చేశారు. దీంతో ఆయన అక్కడ నుండి వెనుదిరిగారు.మంత్రి జయరాం ఇంటి ముట్టడికర్నూలు జిల్లాలో ఆలూరులో కార్మికశాఖ, ఉపాధిశాఖమంత్రి గుమ్మనూరు జయరాం ఇంటిని అంగన్వాడీలు ముట్టడించారు. అనంతరం మంత్రికి వినతిపత్రం అందజేశారు. మీ సమస్యలను సిఎం దృష్టికి తీసుకువెళ్తామని మంత్రి హామీ ఇచ్చారు. మంగళగిరిలో లక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి వచ్చిన మంత్రి రోజాను కలవాలని అంగన్వాడీలు వెళ్లగా సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు. దీంతో అంగన్వాడీ టీచర్లు, ఆయాలు నిరసన వ్యక్తం చేశారు. తమ సమస్యలు వినడానికి కూడా మంత్రి నోచుకోకపోవడాన్ని నిరసించారు.