ప్రజల జీవితాల్లో వెలుగులు నింపడమే నిజమైన సంక్షేమం : ముఖ్యమంత్రి చంద్రబాబు

అమరావతి : ప్రజల జీవితాల్లో వెలుగులు నింపడమే నిజమైన సంక్షేమమని ఎపి సిఎం చంద్రబాబు అన్నారు. వారి జీవన ప్రమాణాల పెంపునకు మొదటి అడుగుపడిందని చెప్పారు. మంగళగిరి నియోజకవర్గం పెనుమాకలో పింఛన్ల పంపిణీని ప్రారంభించిన అనంతరం మసీదు సెంటర్‌లో నిర్వహించిన ప్రజావేదిక కార్యక్రమంలో గ్రామస్థులు, లబ్ధిదారులతో ఆయన మాట్లాడారు. కొత్త ప్రభుత్వంలో మొదటగా పింఛన్ల పంపిణీకి శ్రీకారం చుట్టామని తెలిపారు.

అందరి ఆశీస్సులతో నాలుగోసారి సిఎంగా ప్రమాణం చేశానన్నారు. ప్రజల జీవితాల్లో వెలుగులు నింపడమే నిజమైన సంక్షేమమన్నారు. వారి జీవన ప్రమాణాల పెంపులో మొదటి అడుగుపడిందన్నారు. సమాజమే దేవాలయం అని… ప్రజలే దేవుళ్లు అని ఎన్టీఆర్‌ చెప్పారనీ, ఆయన స్ఫూర్తితో తమ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. పేదలపై శ్రద్ధ పెడతామన్నారు. అనునిత్యం వినూత్నంగా ఆలోచిస్తామన్నారు. ఆర్థిక అసమానతలు లేని సమాజం చూడాలన్నదే తన ఆలోచన అన్నారు. దివ్యాంగులకు పింఛను రూ.6వేలు చేశామని, వారికి చేయూతనివ్వడం సమాజం బాధ్యత. నిత్యావసర వస్తువుల ధరలకు కళ్లెం వేయాల్సి ఉందని చంద్రబాబు తెలిపారు. గత పాలకులు, అధికారులు సచివాలయ సిబ్బందితో పింఛన్ల పింపిణీ తమ వల్ల కాదన్నారు. పంపిణీ చేతకాకపోతే ఇంటికి వెళ్లాలని వారికి ఆనాడే చెప్పానన్నారు. నేడు 1.25 లక్షల మంది సచివాలయ సిబ్బందితో పంపిణీ జరుగుతోందన్నారు. దీనికి వాలంటీర్ల సహాయం కూడా తీసుకోవాలని చెప్పామన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకే రోజు ఐదు సంతకాలు పెట్టానన్నారు. మొదటిది మెగా డీఎస్సీ.. వీలైనంత త్వరగా టీచర్ల నియామకం చేపట్టే బాధ్యత తీసుకుంటానన్నారు. ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ రద్దుపై రెండో సంతకం చేశానన్నారు. అన్న క్యాంటీన్ల పునరుద్ధరణపై మూడోది పెట్టానన్నారు. రూ.5 కే భోజనం చేయొచ్చునన్నారు. త్వరలోనే 183 క్యాంటీన్లను ప్రారంభిస్తామన్నారు. యువతకు ఉద్యోగాల కల్పన కోసం నైపుణ్య శిక్షణ ఇస్తామన్నారు. ప్రభుత్వానికి శక్తి వస్తే ప్రజలకు మరింత తిరిగి ఇచ్చేందుకు అవకాశం ఉంటుందన్నారు. తమది ప్రజా ప్రభుత్వం.. నిరంతరం వారికోసం పనిచేస్తాం అని అన్నారు. ప్రజలు నిండు మనసుతో ఆశీర్వదించి ప్రభుత్వానికి సహకరించాలని చంద్రబాబు కోరారు.

తవ్వుతున్న కొద్దీ గత ప్రభుత్వ తప్పులు, అప్పులే కనబడుతున్నాయి. గతంలో ప్రజల బతుకులను రివర్స్‌ చేశారు.. కోలుకుని మళ్లీ ముందుకు వెళ్లాలి. అందరం సమష్టిగా కలిసి పనిచేద్దాం. సంపద సృష్టించి ఆదాయం పెంచుతాం.. పెంచిన దాన్ని పంచుతాం. మీ అందరి అభిమానం చూరగొని లోకేశ్‌ ఇక్కడి నుంచి పోటీ చేశారు. మంగళగిరిలో 90 వేలకు పైగా మెజారిటీతో ఆయన్ను గెలిపించారు. వైసిపి నేతలు ఐదేళ్ల పాటు ప్రజలను అణగదొక్కారు. పెట్టుబడులు పెట్టేందుకు భయపడే పరిస్థితి కల్పించారు” అని చంద్రబాబు అన్నారు.

➡️