హనుమకొండ : 16 ఏళ్ల బాలికపై సిఐ అత్యాచారం చేసిన ఘటన హనుమకొండ జిల్లాలో జరిగింది. అతనిపై హనుమకొండ జిల్లా కేయూ పోలీసుస్టేషన్లో శుక్రవారం అత్యాచారంతోపాటు పోక్సో చట్టం కింద కేసులు నమోదయ్యాయి.
ఎస్సై రాజ్కుమార్ కథనం మేరకు … ప్రస్తుతం భూపాలపల్లి వీఆర్ సిఐగా పని చేస్తున్న బండారి సంపత్ 2022లో కాకతీయ యూనివర్సిటీ పోలీసుస్టేషన్లో ఎస్సైగా పని చేస్తున్నారు. ఆ సమయంలో హనుమకొండలోని ఓ కాలనీకి చెందిన మహిళతో పరిచయం ఏర్పడి సన్నిహితంగా ఉండేవాడు. అనంతరం ఖమ్మం జిల్లాకు సిఐగా బదిలీ అయినప్పటికీ ఆమెతో స్నేహాన్ని కొనసాగించాడు. ఇటీవల జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో విఆర్ సిఐగా బదిలీపై వచ్చాడు. ఈ క్రమంలో గత కొద్దిరోజులుగా సదరు మహిళ కూతురు (16)పై కన్నేశాడు. అదను చూసి ఆ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ బాలిక తల్లికి విషయం చెప్పడంతో ఆమె కేయూ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు బాధితురాలి ఇంటికి వెళ్లి పోలీసులు విచారణ జరిపారు. సిఐ సంపత్ పై అత్యాచారంతోపాటు పోక్సో చట్టాల కింద కేసులు నమోదు చేశారు.