- 61 లక్షలు ఆస్తి పన్ను చెల్లించిన చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు
- అభినందించిన కమీషనర్ ఎంఎం.నాయుడు
ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : ఆస్తి, ఖాళీ స్థలముల పన్నులపై ప్రభుత్వం ఇచ్చిన వడ్డీ రాయితీ అవకాశాన్ని పలువురు సద్వినియోగం చేసుకోవడం అభినందనీయమని నగరపాలక సంస్థ కమిషనర్ ఎం.మల్లయ్య నాయుడు అన్నారు. చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు దీర్ఘకాలికంగా బకాయి ఉన్న ఆర్యవైశ్య అసోసియేషన్ భవన ఆస్తి పన్నులు ఏకమొత్తంలో చెల్లించి వడ్డీ మాఫీని పొందారు. వాస్తవంగా భవన ఆస్తి పన్ను మొత్తం కోటి 64 లక్షల 18,899 రూపాయలు కాగా, వడ్డీ మాఫీ రూపేనా కేవలం 61 లక్షల 17,239 రూపాయలు చెల్లించారు. కోటి 3 లక్షల 1,660 రూపాయలు లబ్ది పొందినట్లు ఛాంబర్ ప్రతినిధులు తెలిపారు. కేదారిశెట్టి సీతారామమూర్తి, రవ్వ శ్రీనివాస్, ఎం సి హెచ్ గుప్తా, కాపుగంటి ప్రకాష్ తదితరులు కమిషనర్ ఛాంబర్ కు వచ్చి వడ్డీ రాయితీ అవకాశాన్ని వినియోగించుకుని ఆస్తిపన్ను బకాయిను పెద్ద మొత్తంలో చెల్లించారు. ఈ సందర్భంగా కమిషనర్ ఎం.మల్లయ్య నాయుడు మాట్లాడుతూ ప్రభుత్వం ఇచ్చిన ఏకమొత్త చెల్లింపులో వడ్డీ రాయితీ విధానం పట్ల పలువురు ఆసక్తి చూపుతున్నారన్నారు. మొండి బకాయిలు కూడా వసూలు కావడం ఆహ్వానించదగ్గ పరిణామం అని అన్నారు. ఈ నెల 31వ తేదీ వరకు వడ్డీ రాయితీ విధానం అమలులో ఉందని అన్నారు. ఇందుకోసం ప్రత్యేక కౌంటర్లు కూడా ఏర్పాటు చేశామన్నారు. కావున ఆస్తి మరియు ఖాళీ స్థలముల పన్నులను వడ్డీ రాయితీతో ఈనెల 31వ తేదీలోగా చెల్లించాలని ప్రజలకు సూచించారు. ఈ కార్యక్రమంలో సహాయ కమిషనర్ సిహెచ్ తిరుమలరావు, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు వినోద్, కిరణ్, సాయి తదితరులు పాల్గొన్నారు.