ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : మిమ్స్ కార్మికుల అక్రమ అరెస్టులను ప్రజలంతా ఖండిం చాలని సిఐటియు రాష్ట్ర కార్యదర్శి కె.సుబ్బరావమ్మ పిలుపునిచ్చారు. సోమవారం ఎల్బిజి భవనంలో జరిగిన సిఐటియు సమావేశంలో ఆమె మాట్లాడారు. 24 మంది సిఐటియు నాయకులపైనా, మిమ్స్ ఉద్యోగులపైనా యాజమాన్యం అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపడాన్ని సిఐటియు రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండిస్తోందని తెలిపారు. మిమ్స్ లో పనిచేస్తున్న 350 మంది కార్మికులు 67 రోజులుగా న్యాయమైన సమస్యల పరిష్కారానికి శాంతియుతంగా ఆందోళన చేస్తున్నప్పటికీ ప్రభుత్వానికి ఏమాత్రం చలనం లేదని అన్నారు. మిమ్స్ కార్మికులపైనా, నాయకత్వం వహిస్తున్న సిఐటియు నాయకులపైనా అక్రమకేసులు పెట్టి ఇప్పటికే 24మందిని రిమాండ్కు పంపారని తెలిపారు. పోలీసులు మిమ్స్ యాజమాన్యానికి కొమ్ముకాస్తూ అత్యుత్సా హంతో గ్రామాలలో కార్మికులు భయ బ్రాంతులకు గురిచేయడం మాను కోవాలని హితవు పలికారు .ప్రభుత్వ ఉన్నతాధికారులు, కార్మికశాఖ అధికారులు జోక్యం చేసుకుని కార్మికులు సమస్యలు వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు పి.శంకర్రావు, నాయకులు బి.రమణ, ఎ.జగన్మోహన్ పాల్గొన్నారు.