ప్రజాశక్తి-పార్వతీపురంరూరల్ : ఎన్నికల విధుల్లో వైఫల్యాలకు కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి నిశాంత్ కుమార్ హెచ్చరించారు. రిటర్నింగ్, నోడల్ అధికారులు, తహశీల్దార్లు, మున్సి పల్ కమిషనర్లు, ఎంపిడిఒలతో జిల్లా కలెక్టరు కార్యాలయంలో ఎన్నికలపై సోమవారం ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల నిర్వహణకు పూర్తి స్థాయి సంసిద్ధత ఉండాలన్నారు. వచ్చే పది రోజులు కీలకమని, ప్రతి అంశంపైనా శ్రద్ధ వహించాలని ఆయన ఆదేశించారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిపై వచ్చే ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించి రిటర్నింగ్ అధికారి స్థాయిలో చర్యలు చేపట్టాలని స్పష్టంచేశారు. ఎన్నికలకు నియమించిన ప్రతి బృందం సూక్ష్మ పరిశీలన చేయాలని, నియమావళి ఉల్లంఘనకు పాల్పడుతున్న ఉద్యోగులను కూడా గుర్తించాలని సూచించారు. జిల్లాలో ఇప్పటి వరకు నలుగురు ఉద్యోగులను విధుల నుంచి తొలగించామని తెలిపారు. ఎన్నికలలో భాగంగా నగదు, మద్యం, మాదక ద్రవ్యాలు, హింస, ప్రలోభాలు వంటి అంశాలపై దృష్టి సారించాలని ఆయన ఆదేశించారు. వీటిపై గట్టి నిఘా ఉండాలని, ఎటువంటి ఉల్లంఘనలు ఉన్నా కఠినంగా వ్యవహరించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సైతం ఆదేశాలు జారీ చేశారని గుర్తుచేశారు. ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలను విధిగా పాటించాలని ఆదేశించారు. ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు తనిఖీలు ముమ్మరం చేయాలన్నారు. పోలీసు శాఖతో సమన్వయం చేసుకుంటూ వ్యవహరించాలని స్పష్టం చేశారు. అన్ని బృందాలకు గుర్తింపు కార్డులు జారీ చేయాలని, వాహనాలకు ఎన్నికల కమిషన్ విధుల స్టిక్కర్లు అతికించాలని చెప్పారు. ఇవిఎంల ర్యాండమైజేషన్లో భాగంగా ఏజెంట్లు పెన్ను, పెన్సిల్, సెల్ఫోన్లు తదితర సామగ్రి లోపలికి తీసుకురాకూడదని ఆయన స్పష్టం చేశారు. పోస్టల్ బ్యాలెట్ వేసే కేంద్రం చుట్టుపక్కల రాజకీయ కార్యకలాపాలు ఉండరాదని, వాటిపై దృష్టి సారించాలని సూచించారు.12,13,15 తేదీల్లో శిక్షణఎన్నికల ప్రిసైడింగ్ అధికారులు, సహాయ ప్రిసైడింగ్ అధికారులకు ఈ నెల 12, 13, 15 తేదీల్లో శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. సీతంపేట ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి కల్పనాకుమారి, పార్వతీపురం ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి సి.విష్ణుచరణ్, పార్వతీపురం ఆర్డిఒ కె.హేమలత, పాలకొండ ఆర్డిఒ వి.వెంకటరమణ తమ నియోజకవర్గాలలో చేపట్టిన పనులను వివరించారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఎస్.ఎస్ శోబిక, ఇన్ఛార్జి జిల్లా రెవెన్యూ అధికారి జి.కేశవనాయుడు, ఎస్డిసి ఆర్వి సూర్యనారాయణ, పార్లమెంటు నియోజకవర్గ సహాయ రిటర్నింగ్ అధికారి కె.రామచంద్రరావు, నోడల్ అధికారులు – జిల్లా పరిశ్రమల అధికారి ఎం.వి.కరుణాకర్, జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి లోచర్ల రమేష్, జిల్లా రవాణా అధికారి సి.మల్లికార్జున రెడ్డి, జిల్లా ప్రజా రవాణా అధికారి టివిఎస్ సుధాకర్, తహశీల్దార్లు, మున్సిపల్ కమిషనర్లు, ఎంపిడిఒలు తదితరులు పాల్గొన్నారు.