రాంచీ : ఫ్యూడల్ శక్తులపై జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ తిరుగుబాటు ప్రకటించారు. ప్రతిపక్ష కూటమి ‘ఇండియా బ్లాక్ ‘ దేశం నుండి బిజెపిని తరిమికొడుతుందని స్పష్టం చేశారు. గిరిజనుల ప్రత్యేకంగా జరుపుకునే ‘హుల్ దివస్’ సందర్భంగా బగ్నాడిహ్లో ఆదివారం ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తాను జైలు నుండి విడుదలైన తర్వాత కాషాయం పార్టీ కల్లోలంగా మారిందని, బిజెపి నేతలు తనకి వ్యతిరేకంగా మళ్లీ కుట్ర పన్నుతారని అన్నారు.
” ఈ రోజు మనందరికీ స్ఫూర్తిదాయకమైన రోజు అని, మిమ్మల్ని ఉద్దేశించి మాట్లాడేందుకు ఈ రోజు మొదటిసారిగా నా ఇంటి నుండి బయటికి వచ్చాను. బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా సంతాల్ తిరుగుబాటులానే మనం హల్ తిరుగుబాటుని ప్రకటిద్దాం. ఫ్యూడల్ శక్తులను జార్ఖండ్ నుండే కాకుండా దేశం నుండి తరిమికొట్టాలి” అని అన్నారు. జార్ఖండ్ను విప్లవకారుల భూమిగా పిలుస్తారు. జైలు శిక్షకు, లాఠీ చార్జ్ లేదా ఉరిశిక్షకైనా భయపడమని పునరుద్ఘాటించారు.