న్యూఢిల్లీ : అంతర్జాతీయ టీ20లకు భారత ఆల్రౌండర్ రవీంద్ర జడేజా వీడ్కోలు పలికాడు. టీ20 ప్రపంచ కప్లో భారత్ విజేతగా నిలిచిన ఒక రోజు తరువాత ఆదివారం జడేజా ఈ నిర్ణయాన్ని ప్రకటించాడు. శనివారం విజేతగా నిలిచిన భారత్ జట్టులో జడేజా సభ్యుడిగా ఉన్నాడు. జడేజా వయస్సు 36 ఏళ్లు. శనివారం విజయం తరువాత విరాట్ కోహ్లి, రోహిత్ శర్మలు టీ20లకు వీడ్కోలు ప్రకటించిన సంగతి తెలిసిందే. 2009లో శ్రీలంకపై అరంగేట్రం చేసిన జడేజా ఇప్పటివరకు 74 టీ20 మ్యాచ్లు ఆడి 515 పరుగులు చేసి.. 54 వికెట్లు పడగొట్టాడు. ”నేను మనస్ఫూర్తిగా అంతర్జాతీయ టీ20లకు వీడ్కోలు పలుకుతున్నాను. ఎల్లప్పుడూ నా దేశం కోసం నా శక్తిమేరకు అత్యుత్తమ ప్రదర్శన చేశా. ఇతర ఫార్మాట్లలో (వన్డేలు, టెస్టులు) కెరీర్ను కొనసాగిస్తాను. టీ20 ప్రపంచకప్ను గెలవాలనే కల నిజమైంది. ఇది నా అంతర్జాతీయ టీ20 కెరీర్లో ఉన్నతమైన శిఖరం. ఇన్నాళ్లు నాకు మద్దతుగా నిలిచిన అభిమానులకు ధన్యవాదాలు” అని జడేజా తన ఇన్స్టా ఖాతాలో వరల్డ్ కప్ ట్రోఫీని పట్టుకుని దిగిన ఫొటోని పోస్టు చేశాడు.