వాషింగ్టన్ : ఇజ్రాయిల్ సైన్యం గాజాలోని హమాస్ సొరంగాల్లోకి సముద్రపు నీటిని పంపింగ్ చేయడం ప్రారంభించింది. అమెరికాకు చెందిన ఓ అధికారి పేర్కొన్నట్లు వాల్స్ట్రీట్ జర్నల్ మంగళవారం పేర్కొంది. ఈ ప్రక్రియకు కొన్ని వారాలు పట్టవచ్చని తెలిపింది.
గాజాలోని పలు సొరంగాల్లో హమాస్ బందీలు, ఆయుధాలను దాచిపెడుతోందని ఇజ్రాయిల్ ఆరోపిస్తోన్న సంగతి తెలిసిందే. సముద్రపు నీటిని పంపింగ్ చేయడంతో ఆ సొరంగాలను ధ్వంసం చేయవచ్చని కొంతమంది బైడెన్ పరిపాలనా అధికారులు తెలిపారు. అయితే సముద్రపు నీరు గాజా మంచినీటి సరఫరాకు ప్రమాదం కలిగిస్తుందని పలువురు అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు వార్తాపత్రిక నివేదించింది. ఈ నివేదికపై ఇజ్రాయిల్ రక్షణ మంత్రిత్వ శాఖ ప్రతినిధి స్పందించలేదు.