న్యూఢిల్లీ : బ్యాంక్ ఆఫ్ బరోడా (బిఒబి)లో చిరిగిన నోట్ల మార్పిడికి సంబంధించిన లావాదేవీల్లో వ్యత్యాసం కనబడింది. దీంతో ప్రభుత్వ రంగంలోని బిఒబికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బిఐ) భారీ షాక్ ఇచ్చింది. ఈ అంశంలో తమకు ఆర్బిఐ రూ.5 కోట్ల జరిమానా విధించినట్లు బిఒబి శుక్రవారం రెగ్యూలేటరీ ఫైలింగ్లో తెలిపింది. అదే విధంగా చిరిగిన నోట్లలో నకిలీ నోట్లను ఆర్బిఐ గుర్తించింది. దీనిపై అదనంగా మరో రూ.2,750 జరిమానా వేసింది. డిసెంబర్ 18, 20 తేదీల్లో వేర్వేరుగా ఈ జరిమానా విధించినట్లు బిఒబి తెలిపింది. నిబంధనలు పాటించకుండా భారీ మొత్తంలో రుణాలు జారీ చేసినందుకు గత నెలలోనూ ఆర్బిఐ రూ.4.35 కోట్ల జరిమానా వేసింది. అదే విధంగా మహారాష్ట్రలోని ఠాణె జిల్లా కేంద్ర సహకార బ్యాంకుకు ఆర్బిఐ రూ.2లక్షల జరిమానా విధించింది. ఈ బ్యాంకు తమ డైరెక్టర్లలో ఒకరికి రుణం మంజూరు చేసిన కారణంగా ఈ జరిమానా విధిస్తున్నట్లు తెలిపింది.