ప్రజాశక్తి – కాకినాడ :ఎస్ఎఫ్ఐలోకి కొత్తగా వచ్చినవారు పాత నడవడికను, పద్ధతులను మార్చుకోవాలని పిడిఎఫ్ ఎమ్మెల్సీ ఐ.వెంకటేశ్వరరావు సూచించారు. కాకినాడలోని అంబేద్కర్ భవన్లో జరుగుతున్న 24వ ఎస్ఎఫ్ఐ రాష్ట్ర మహాసభ రెండో రోజు కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గని మాట్లాడారు. ఈ ఏడాది చాలామంది విద్యార్థులు నూతనంగా ఎస్ఎఫ్ఐలోకి రావడం అభినందనీయమన్నారు. వారు గత వ్యక్తిగత నడవడిక, పద్ధతులను పూర్తి స్థాయిలో మార్చుకొని విద్యా సమస్యలు, విద్యార్థుల సమస్యలు, సమాజంలో జరిగే ప్రజా వ్యతిరేక కార్యక్రమాలపై పోరాటం చేయగలిగే పోరాట పటిమను అలవాటు చేసుకోవాలన్నారు. ఎస్ఎఫ్ఐలో ఉండే వారి జీవితం, అలవాట్లు నడవడిక అందరికీ ఆదర్శప్రాయంగా ఉండాలని ఆయన సూచించారు.