ఎన్ఇపిని రద్దు చేసి శాస్త్రీయ విద్యను ప్రవేపెట్టాలి
ఎస్ఎఫ్ఐ రాష్ట్ర మహాసభలో పలు తీర్మానాలకు ఆమోదం
ప్రజాశక్తి – కాకినాడ ప్రతినిధి : రాష్ట్రవ్యాప్తంగా సంక్షేమ హాస్టల్లో సమస్యలను పరిష్కరించాలని, నూతన జాతీయ విద్యా విధానాన్ని రద్దుచేసి శాస్త్రీయ విద్యను ప్రవేశపెట్టాలని ఎస్ఎఫ్ఐ 24వ రాష్ట్ర మహాసభలు సందర్భంగా పలు తీర్మానాలను ఆమోదించారు. శాంతి, స్వాతంత్య్రం కోసం పోరాడిన అద్భుతమైన పోరాట శ్రేణిని వారసత్వంగా పొందుతూ ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది జీవితాలు నాశనం చేస్తున్న సామ్రాజ్యవాద శక్తుల దురాశకు వ్యతిరేకంగా శాంతి కోసం పోరాడాలని తీర్మానం చేశారు. విద్యలో ప్రత్యామ్నాయ కేరళ విద్యా నమూనాను సమర్థించుకుందామని, రాష్ట్రానికి ప్రత్యేకహోదా, విభజన హామీలను అమలు చేయాలని, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణను ఆపాలని, కడప ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణం చేయాలని, విద్యార్థినులపై దాడులు, అత్యాచారాలను అరికట్టాలని, నిర్భయ చట్టాన్ని పగడ్బందీగా అమలు చేయాలని, ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయాలని, విద్యార్థి సంఘాలకు ఎన్నికలు నిర్వహించాలని, పరిశోధక విద్యార్థులకు నాన్ నెట్ ఫెలోషిప్ పథకాన్ని ప్రవేశపెట్టాలని, ఎయిడెడ్ విద్యాసంస్థలను కొనసాగించాలి. 35, 42, 50,51, 19 జిఒలను రద్దు చేయాలని, జిఒ 77ను రద్దు చేయాలని, మెడికల్ కళాశాలల్లో 108, 107 జిఒలను రద్దు చేయాలని, కన్వీనర్ కోటాలోనే అన్ని సీట్లు భర్తీ చేయాలని, టీచర్ పోస్టులు భర్తీ చేయాలని, గిరిజన విద్యాసంస్థల్లో విద్యార్థి,ప్రజా సంఘాల ప్రవేశాన్ని నిలిపివేస్తూ తీసుకొచ్చిన ఉత్తర్వులను వెనక్కి తీసుకోవాలని, కరువు ప్రాంతాల్లో చదువుతున్న విద్యార్థులకు ఫీజుల మినహాయింపునివ్వాలని, హానర్స్ డిగ్రీ విధానాన్ని రద్దు చేయాలి. ఇంటెన్సివ్ను పరీక్షలకు ముడి పెట్టకుండా, కోర్సుకు తగ్గ ఇంటెన్సిప్ ఇవ్వాలని, ప్రయివేటు విద్యాసంస్థల్లో ఫీజు నియంత్రణ చట్టాన్ని పగడ్బందీగా అమలు చేయాలని, కార్పొరేట్ విద్యాసంస్థల్లో విద్యార్థుల ఆత్మహత్యలను నివారించాలని తీర్మానాలు చేశారు. అలాగే సెంట్రల్ యూనివర్సిటీ, ట్రైబల్ యూనివర్సిటీకి నిధులు కేటాయించి నిర్మాణం వేగవంతం చేయాలని, నూతనంగా ఏర్పడిన జిల్లాలకు యూనివర్సిటీ మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలని, కామన్ పీజీ సెట్ రద్దు చేయాలి. యూనివర్సిటీ స్వయం ప్రతిపత్తి కాపాడాలని, అభివృద్ధికి నిధులు కేటాయించాలని, ఇంటర్ విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, మధ్యాహ్న భోజనం, ఖాళీ పోస్టులు భర్తీ చేయాలని, డిగ్రీ అడ్మిషన్లలో ఆన్లైన్ విధానాన్ని రద్దు చేయాలి.30 శాతం సీట్లు మేనేజ్మెంట్ కోటాను రద్దు చేయాలని, విద్యార్థులకు ఉచితంగా న్యాప్కిన్, శానిటరీ ఫ్యాడ్స్ ఇవ్వాలని, సంక్షేమ పథకాలకు ఎటువంటి షరతులు లేకుండా అర్హులందరికీ అమలు చేయాలని, పెండింగ్లో ఉన్న బకాయిలు విడుదల చేయాలని, పెంచిన బస్సు ఛార్జీలు తగ్గించాలి. బడి బస్సులు నడపాలని, అంగన్వాడీల సమ్మె, మున్సిపల్ వర్కర్ల సమ్మెకు మద్దతు తెలిపేందుకు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు.