ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : సమ్మె విరమించాలంటూ అంగన్వాడీలను బెదిరించడానికి బదులుగా సమస్యల పరిష్కారంపై దృష్టి సారించాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాయి. ఈ నెల 5లోపు విధుల్లో చేరకపోతే శాఖపరమైన చర్యలు తీసుకుంటామంటూ కలెక్టర్లు జారీ చేసిన సర్క్యులర్లను ప్రస్తావిస్తూ అటువంటి వాటికి భయపడేది లేదని తెలిపాయి. నేడు (బుధవారం) తలపెట్టిన కలెక్టరేట్ల బైఠాయింపు కార్యక్రమంలో ఎటువంటి మార్పులేదని, దానిని జయప్రదం చేయాలని పిలుపు నిచ్చాయి. ఈ మేరకు అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్ యూనియన్ (సిఐటియు) ప్రధానకార్యదర్శి కె సబ్బరావమ్మ, అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ (ఎఐటియుసి) ప్రధానకార్యదర్శి జె లలితమ్మ, ఎపి ప్రగతిశీల అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ (ఐఎఫ్టియు) ప్రధానకార్యదర్శి విఆర్ జ్యోతి ఒక ప్రకటన విడుదల చేశారు. ‘బెదిరింపు’ సర్క్యులర్లను కలెక్టర్లు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.