పుస్తకం ఆవిష్కరణ చేస్తున్న దృశ్యం
సాహిత్యానికి పట్టుగొమ్మ నంద్యాల
‘శూన్యపు మనసులో చిగుర్లు’ పుస్తకావిష్కరణ
ప్రజాశక్తి – నంద్యాల
కళా,సాహిత్య రంగాలలో నంద్యాలకు ప్రత్యేకస్థానం ఉందని పలువురు వక్తలు పేర్కొన్నారు. కవి కొప్పుల ప్రసాద్ రచించిన ‘శూన్యపు మనసులో చిగుర్లు’ పుస్తకావిష్కరణ సభ శనివారం స్థానిక రామకృష్ణ డిగ్రీ కళాశాల మినీ ఆడిటోరియంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సాహితీ స్రవంతి అధ్యక్షులు శ్రీనివాసమూర్తి అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథులుగా బాలసాహితీ వేత్త డాక్టర్ హరికిషన్, కళారాధన ప్రధాన కార్యదర్శి డాక్టర్ జి.రవికృష్ణ, సూరన సారస్వత సంఘం అధ్యక్షులు డాక్టర్ గెలివి సహదేవుడు, ఎన్జీవో నాయకులు మణి శేఖర్ రెడ్డి, హుస్సేన్ రెడ్డి, రోటరీ క్లబ్ ప్రతినిధులు డివి.సుబ్బయ్య, చింతల మోహన్ రావు, వైష్ణవ వెంకట రమణమూర్తి, అన్నెం శ్రీనివాస రెడ్డి, నరేంద్ర తదితరులు హాజరై పుస్తకావిష్కరణ చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ జి.రవికృష్ణ మాట్లాడుతూ కళా, సాహిత్య రంగాలలో నంద్యాలకు ప్రత్యేకస్థానం ఉందని వర్థమాన కవి ‘కొప్పుల’ కవితా రచనలు సామాజిక ప్రయోజనంతో కొనసాగడం హర్షణీయమన్నారు. శ్రీనివాసమూర్తి మాట్లాడుతూ నంద్యాల్లో కవులను, రచయితలను ప్రోత్సహించడంలో సాహితీ స్రవంతి ముందుంటుందని తెలిపారు. డాక్టర్ హరికిషన్ పుస్తక సమీక్ష చేశారు. పుస్తక రచయిత కొప్పుల ప్రసాద్ మాట్లాడుతూ సమాజాన్ని జాగతం చేయాలన్న తపనతో నిరంతరం అక్షర ప్రవాహాన్ని కొనసాగిస్తున్నానని తెలిపారు.ఈ సందర్భంగా సాహితీ స్రవంతి ఆధ్వర్యంలో సాహితీవేత్తలు కవి ‘కొప్పుల’ను ఘనంగా సత్కరించారు. అనంతరం నిర్వహించిన ‘నంద్యాల కవులు -సాహిత్యం’ అంశంపై జరిగిన చర్చలో కవులు నీలకంఠమాచారి, మాబుబాషా, గద్వాల రామకృష్ణ, ఎద్దు ప్రసాద్, లలితా సరస్వతి, భవాని లీలావతి, రఫీ ,మద్దిలేటి , కన్నయ్య, గోపాల్, మధుసూదన్ తదితరులు పాల్గొని తెలుగు భాషా సాహిత్యాన్ని సుసంపన్నం చేయడానికి ఉపాధ్యాయులు, సాహితీ సంస్థలు కృషి చేయవలసిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.