తిరువనంతపురం : దేశంలో అవినీతి అతి తక్కువగా జరుగుతున్న రాష్ట్రంగా కేరళ నిలవడంపై రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్ స్పందించారు. ఈ రికార్డు సాధించినందుకు తాను, తన మంత్రిమండలి సహచరులు, వామపక్ష కూటమి తలెత్తుకొని నిలబడగలిగామని ఆయన వ్యాఖ్యానించారు. అయితే దీనిపై తాము సంతృప్తి చెందడం లేదని, కేరళను పూర్తిగా అవినీతి రహిత రాష్ట్రంగా మార్చడమే తమ లక్ష్యమని తెలిపారు. కొన్ని ఇతర రాష్ట్రాల్లో మాదిరిగా కేరళలోని ప్రభుత్వ శాఖలు కానీ, సంస్థలు కానీ పనులు లేదా ప్రాజెక్టులు పూర్తి చేసినందుకు ఎవరి నుండి కమీషన్లు తీసుకోవని పినరయి చెప్పారు. ‘అందుకే మేము తల ఎత్తుకొని నిలబడ్డాం. అందుకే అవినీతి విషయంలో ఎవరి ముందూ తల దించాల్సిన అవసరం రాలేదు. అది మా మంత్రిమండలి, లెఫ్ట్ ఫ్రంట్ ఘనత’ అని బుధవారం జరిగిన రెవెన్యూ భవన్ శంకుస్థాపన కార్యక్రమంలో ఆయన తెలిపారు. మనశ్శాంతి కోల్పోవడానికి ధనదాహమే ప్రధాన కారణమని పినరయి విజయన్ అన్నారు.