ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : రాష్ట్ర వ్యాప్తంగా 53,35,519 మంది 0-5 ఏళ్ల మధ్య వయసు గల చిన్నారులకు పల్స్ పోలియో చుక్కలు వేసేందుకు పటిష్ట ఏర్పాట్లు చేసినట్లు రాష్ట్ర వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎమ్టి కృష్ణబాబు తెలిపారు. సచివాలయంలో బుధ వారం ఆయన అధ్యక్షతన పల్స్ పోలియో- 2024పై స్టేట్ టాస్క్ఫోర్స్ సమావేశం జరిగింది. అంగన్వాడీ వర్కర్లు, గ్రామ సచివాలయాల వలంటీర్లతో ఎఎన్ఎమ్లు సమన్వయం చేసుకోవాలన్నారు. పల్స్ పోలియోపై అవగాహన కల్పించాలన్నారు. మార్చి 3న పోలియో చుక్కలు వేయించుకోలేకపోయిన పిల్లల వివరాల్ని తీసుకుని మార్చి 4న ఇంటింటికీ వెళ్లి పోలియో చుక్కలు వేయాలని సూచించారు. ఈ సమావేశంలో విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్, ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ కమిషనరు జె నివాస్, సెకండరీ హెల్త్ డైరెక్టరు వెంకటేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.