ఆదివాసీల ఆరోగ్యానికి నిర్లక్ష్యం చెద

Feb 21,2024 21:26

ప్రజాశక్తి-సాలూరు : ఒకే గొడుగు కింద పని చేసే వివిధ రకాల ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఒక్కో విధమైన సౌకర్యాలు ఉండడం పట్ల గిరిజనుల్లో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. గిరిజన సంక్షేమ శాఖ పరిధిలో ఉన్న గురుకుల పాఠశాలలు, ఏకలవ్య పాఠశాలల్లో మెరుగైన వసతి, భోజన సదుపాయాలు ఉంటాయి. అదే గిరిజన సంక్షేమ శాఖ పరిధిలో ఉన్న గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో మాత్రం నాసిరకం సౌకర్యాలున్నాయి. వసతి, భోజన సౌకర్యాలలో తేడా ఉండొచ్చు. కానీ అక్కడా ఇక్కడా చదువుతున్నది ఆదివాసీ గిరిజన విద్యార్థులే. కానీ వారి ఆరోగ్య పరిరక్షణలో, వైద్య సేవలు అందించడంలో మాత్రం వివక్ష చూపడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గిరిజన సంక్షేమ గురుకుల, ఏకలవ్య పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఆరోగ్య సేవలు అందించడానికి ఎఎన్‌ఎంలను నియమించారు. ఈ పాఠశాలల్లో విద్యార్థులకు ఏవైనా అనారోగ్య సమస్యలు తలెత్తితే వెంటనే వైద్య సిబ్బంది అప్రమత్తమై సకాలంలో వైద్య సేవలు అందించే ప్రయత్నం చేస్తున్నారు. అదే గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఆరోగ్య సమస్య వస్తే దిక్కూ దిమానా లేని పరిస్థితి కనిపిస్తోంది. ఈ పాఠశాల ప్రధానోపాధ్యాయుడో, వార్డెనో అనారోగ్యానికి గురైన విద్యార్థులను ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్యసేవలు అందేలా చూడాలి. గిరిజన సంక్షేమ శాఖ పరిధిలో ఉన్న పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణపై ఇంత తేడా కనబరచడం వివాదాస్పదమవుతోంది. మన్యం జిల్లాలో పార్వతీపురం ఐటిడిఎ పరిధిలో ఉన్న గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో ఎఎన్‌ఎంలను నియమించలేదు. గత ప్రభుత్వం హయాంలో ఆదివాసీ ఆరోగ్యం అనే కార్యక్రమం కింద అన్ని గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లోనూ ఆరోగ్య కార్యకర్తలను నియమించారు. పార్వతీపురం ఐటిడిఎ పరిధిలో 55 గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలు, 16 పోస్ట్‌ మెట్రిక్‌ వసతిగృహాలు ఉన్నాయి. గత ప్రభుత్వ హయాంలో ఈ పాఠశాలల్లో విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణకు ఆరోగ్య కార్యకర్తల నియామకం చేపట్టారు. వైసిపి అధికారంలోకి వచ్చిన తర్వాత గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో ఎఎన్‌ఎంలను నియామకానికి నీళ్లొదిలింది. ఇప్పుడున్న గురుకుల, ఏకలవ్య పాఠశాలల్లో ఎఎన్‌ఎంలను నియమించారు. ఏకలవ్య పాఠశాలల్లో అయితే ఇద్దరు చొప్పున ఎఎన్‌ఎంలు పని చేస్తున్నారు. మూడు రకాల పాఠశాలల్లో చదువుతున్నది ఆదివాసీ గిరిజన విద్యార్థులే. వారి భోజనం, వసతి సౌకర్యాలల్లో స్పష్టమైన తేడా చూపిస్తున్న ప్రభుత్వం వారి ఆరోగ్య పరిరక్షణలోనూ వివక్ష చూపడం పట్ల ఆగ్రహం వ్యక్తమవుతోంది. ప్రధానంగా మన్యం జిల్లాలో జరుగుతున్న విద్యార్థుల మరణాల్లో 90 శాతం పైగా గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో చదువుతున్న వారివే కావడం గమనార్హం. మారుమూల గిరిజన గ్రామాలకు చెందిన విద్యార్థులే ఎక్కువగా గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో చదువుతున్నారు. ఈ ఏడాదిలో పార్వతీపురం ఐటిడిఎ పరిధిలో జరిగిన విద్యార్థుల మరణాల్లో ఎక్కువ మంది ఆశ్రమ పాఠశాలలకు చెందిన విద్యార్థులే ఉన్నారు.

ఎందుకీ వివక్ష?

మారుమూల గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల పట్ల ప్రభుత్వం ఎందుకు ఇంత వివక్ష చూపిస్తున్నదనే ప్రశ్న తలెత్తుతోంది. గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు భోజనం, వసతి సౌకర్యాలతో పాటు వైద్య సేవలు అందించడానికి సంబంధించిన పాఠశాల యాజమాన్యమే బాధ్యత వహించాలి. ఆ పాఠశాల హెచ్‌ఎం లేదా వార్డెన్‌ విద్యార్థులకు అనారోగ్య సమస్య తలెత్తితే ఆసుపత్రికి తీసుకెళ్ళాలి. విద్యార్థుల తల్లిదండ్రులకు సమాచారం అందించి ఆసుపత్రిలో చేర్పించాలి. వైద్య సేవలు అందేలా చూడాలి. ఒకవేళ అక్కడ ఆరోగ్యం కుదుట పడకపోతే ప్రాంతీయ ఆసుపత్రికో, జిల్లా ఆసుపత్రికో తీసుకెళ్ళాలి. ఈ విద్యార్థుల రవాణా ఖర్చులు, వైద్య సేవల ఖర్చులు సంబంధిత పాఠశాల యాజమాన్యమే భరించాలి. ఈ ఖర్చులు భరించేందుకు ప్రభుత్వం నుంచి ఏ విధమైన నిధులూ మంజూరు కావడం లేదు. పాఠశాలల్లో వసతిగృహాల్లో విద్యార్థులకు సరిపడా వంట మనుషులు లేరు. లేకపోతే యాజమాన్యమే బాధ్యత సొంత ఖర్చులతో వంటపని చేసేవారిని ఏర్పాటుచేసుకోవాలి. ఈ ఖర్చులన్నీ ఆశ్రమ పాఠశాల యాజమాన్య బాధ్యులే భరించాలి. పనిఒత్తిడితోపాటు ఖర్చులు తడిసిమోపెడు అవుతున్న తీరు కనిపిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో కొన్ని పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు అనారోగ్య సమస్యలు తలెత్తినప్పుడు పాఠశాల బాధ్యులు సకాలంలో స్పందించకపోవడం కూడా జరుగుతోంది. అదే గురుకుల, ఏకలవ్య పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు మెరుగైన భోజనం వసతి సౌకర్యాలతోపాటు వైద్య సేవలు అందించడానికి సిబ్బంది ఉన్నారు. అనారోగ్య సమస్యలు తలెత్తితే ఖర్చుల కోసం ప్రత్యేక నిధులు కూడా మంజూరవుతున్నాయి. ఎక్కువమంది విద్యార్ధులు చదువుతున్న గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల విద్యార్థుల ఆరోగ్యం పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. వివిధ అనారోగ్య కారణాలతో వరుసగా విద్యార్థుల మరణాలు సంభవిస్తున్నా పాలకుల్లో గాని, మన్యం జిల్లా అధికారుల్లో చలనం లేదు. మరణాలకు ప్రధాన కారణం ఏమిటనే దిశగా అడుగులు వేయడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

మరణాలకు అడ్డుకట్ట వేయలేరా?

గతేడాదిలో పదోతరగతి పరీక్షా ఫలితాల్లో మన్యం జిల్లా రాష్ట్ర స్థాయిలో ఎక్కువ శాతం ఉత్తీర్ణత సాధించిన జిల్లాగా ఆవిర్భవించింది. ఈ ఘనత వెనుక తమ కృషి, పట్టుదల ఉందని మన్యం జిల్లా అధికారులు గొప్పలు చెప్పుకున్నారు. ఇప్పుడు విద్యార్థుల మరణాల్లోనూ జిల్లా దూసుకుపోతున్న పరిస్థితి కనిపిస్తోంది. గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశా లల్లో మరణాల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులు దృష్టి సారించిన దాఖలాలు లేవు. చేతికంది వచ్చే పిల్లలు గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో చదువుతూ మృత్యువాత పడుతుండడంతో వారి తల్లిదండ్రులు గర్భశోకానికి గురవుతున్నారు. విద్యార్థుల మరణాలు లేని మన్యం జిల్లాగా పేరు తేవడానికి కృషి చేయాలని గిరిజన సంఘాలు కోరుతున్నాయి.

ఆరోగ్య కార్యకర్తలను నియమించాలి

గిరిజన సంక్షేమ శాఖ పరిధిలో ఉన్న ఏకలవ్య, గురుకుల పాఠశాలల్లో ఎఎన్‌ఎంలను నియమించిన ప్రభుత్వం ఆశ్రమ పాఠశాలల్లో ఎందుకు నియమించలేదని గిరిజన సంక్షేమ సంఘం అధ్యక్షుడు తాడంగి సాయిబాబు, ప్రధాన కార్యదర్శి పాలక రంజిత్‌ కుమార్‌ ప్రశ్నించారు. మారుమూల గిరిజన ప్రాంతాలకు చెందిన విద్యార్థులు ఎక్కువగా ఆశ్రమ పాఠశాలల్లో చదువుతున్నారని, వివిధ అనారోగ్య కారణాలతో మరణాలు అక్కడే సంభవిస్తున్నాయని చెప్పారు. గత ప్రభుత్వం హయాంలో ఆదివాసీ ఆరోగ్యం కింద ఆశ్రమ పాఠశాలల్లో ఆరోగ్య కార్యకర్తలను నియమించిందని గుర్తుచేశారు. ఇప్పుడు కూడా ఆరోగ్య కార్యకర్తలను నియమించాలని కోరారు.

➡️