పిడుగురాళ్లలో కందిపప్పు మిల్లు ను సందర్శించిన జాయింట్ కలెక్టర్
పల్నాడు జిల్లా: పల్నాడు జిల్లాలో 43,250 ఎకరాల్లో రైతులు సాగు చేసిన కంది పంట ద్వారా 25 వేల మెట్రిక్ టన్నుల కందులను కొనుగోలు లక్ష్యం నిర్దేశించామని జాయింట్ కలెక్టర్ ఎ.శ్యాం ప్రసాద్ తెలిపారు. జిల్లా పరిధిలోని డాల్ మిల్లులను జెసి శుక్రవారం తనిఖీ చేశారు. అనంతరం కలెక్టరేట్లోని స్పందన హాలులో మిల్లు యజ మానులతో సమావేశమయ్యారు. సివిల్ సప్లై కార్పొరేషన్కు అనుసంధానించబడిన జిడిఎల్ఎమ్స్ ఏజెన్సీ ద్వారా కందులు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి మద్దతు ధరకు కొనుగోలు చేస్తామన్నారు. వ్యవసాయ శాఖ అధికారుల అంచనా ప్రకారం ఈ నెల చివరి వారం నుండి కంది పంట నూర్పిడి మొదలవుతుం దన్నారు. కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించిన కందులను బఫర్ గోదాముల్లో నిల్వ ఉంచుతామని, అనంతరం సివిల్ సప్లైస్ కేంద్ర కార్యాలయం సూచనల మేరకు కందిపప్పు మిల్లులకు తరలిస్తామని తెలిపారు. డాల్ మిల్లుల యజమానులు సివిల్ సప్లైస్ కార్పొరేషన్కు తగిన మొత్తంలో బ్యాంక్ షురిటి సమర్పించాలన్నారు. జిల్లాలోని డాల్ మిల్లర్స్ యజమానులు అందరూ ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా కందిపప్పు సరఫరాకు సహకరించాలని కోరారు. సమావేశంలో జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి ఎస్.పద్మశ్రీ, శాఖ జిల్లా మేనేజర్ జి.వరలక్ష్మి, డాల్ మిల్లర్లు పాల్గొన్నారు.