ప్రజాశక్తి – పెద్దాపురం, పిఠాపురంతమ సమస్యల పరిష్కారం కోరుతూ మున్సిపల్ వర్కర్లు చేపట్టిన నిరవధిక సమ్మె శుక్రవారం 4వ రోజుకు చేరుకుంది. స్థానిక మున్సిపల్ సెంటర్లో నిర్వహిస్తున్న సమ్మె శిబిరం వద్దకార్మికులు ఉరి తాళ్లతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సిఐటియు నాయకులు సిరపరపు శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ కార్మికుల పట్ల నిరంకుశంగా వ్యవహరిస్తోందన్నారు. సమాన పనికి సమాన వేతనం ఇస్తామని చెప్పిన ముఖ్యమంత్రి మాట తప్పారన్నారు. ఇంజినీరింగ్ కార్మికులకు ఇస్తామని చెప్పిన రిస్క్ హెల్త్ అలవెన్సులు ఇవ్వడానికి ప్రభుత్వం చాలా ఇబ్బందులకు గురి చేస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నాయకులు శివకోటి అప్పారావు, వర్రే గిరిబాబు, ఇసరపు దుర్గాప్రసాద్, సింగంపల్లి సింహాచలం, ముత్యాల దుర్గ, వర్రే భవాని, దొండపాటి శేషారావు, మడికి మోహన్రావు, యాసలపు శ్రీకాంత్, వర్రే రాజేష్, కెవి.రమణ, బాసిన భద్రరావు, నాగేశ్వరరావు పాల్గొన్నారు.పిఠాపురం నియోజకవర్గంలోని గొల్లప్రోలులో సమ్మె శిబిరంలో చెవులో పువ్వులు పెట్టుకొని నిరసన తెలిపారు. సిఐటియు జిల్లా అధ్యక్షులు దువ్వా శేషబాబ్జి మాట్లాడారు. శానిటేషన్ కార్మికులకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలన్నారు. ఎన్నికలు ముందు జగన్ అందరినీ పర్మినెంట్ చేస్తామని హామీ ఇచ్చారని ఆ హామీ నిలబెట్టుకోవాలన్నారు. ప్రజల ఆరోగ్యం అందించే ప్రధాన భూమికలో వీళ్ళ పాత్ర చాలా కీలకమని తక్షణం సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి ఎస్విఎస్ఎన్.వర్మ సమ్మె శిబిరం వద్దకు వచ్చి మద్దతు తెలిపారు. తక్షణం మున్సిపల్ శానిటేషన్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎన్.యేసమ్మ, సిహెచ్వి.రమణ, జి.రాజులు, కుమారి, భాను ప్రసాద్, రామారావు, సత్యవతి పాల్గొన్నారు.
![మున్సిపల్ కార్మికుల నిరసన](https://prajasakti.com/wp-content/uploads/2023/12/Untitled-1-copy-286.jpg)