ఎయిడ్స్‌పై అప్రమత్తంగా ఉండాలి

Dec 1,2023 21:52

ప్రజాశక్తి-విజయనగరం కోట  :   ఎయిడ్స్‌ వ్యాధిపట్ల అప్రమత్తంగా ఉండాలని జాయింట్‌ కలెక్టర్‌ మయూర్‌ అశోక్‌ సూచించారు. ప్రపంచ ఎయిడ్స్‌ దినోత్సవం సందర్భంగా శుక్రవారం నిర్వహించిన అవగాహనా ర్యాలీని ఆర్‌టిసి కాంప్లెక్స్‌ వద్ద ఆయన ప్రారంభించారు. ర్యాలీ మయూరి జంక్షన్‌, ఆర్‌ అండ్‌ బి జంక్షన్‌ మీదుగా జిల్లా వైద్యారోగ్యశాఖ కార్యాలయం వరకు సాగింది. ఈ సందర్భంగా జెసి మయూర్‌ అశోక్‌ మాట్లాడుతూ, ఎయిడ్స్‌ వ్యాధి పట్ల ప్రతీఒక్కరూ అవగాహన పెంచుకోవాలని అన్నారు. ఈ వ్యాధి సోకకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై విస్తత ప్రచారం చేయాలని సూచించారు. ముందుగా గుర్తించి, వైద్యుల పర్యవేక్షణలో మందులు వాడితే, ఎయిడ్స్‌ ప్రాణాంతకం కాదని అన్నారు. జిల్లాలో 17 చోట్ల హెచ్‌ఐవి పరీక్షలను నిర్వహిస్తున్నారని చెప్పారు. ఎయిడ్స్‌ పరీక్షల ఫలితాలను రహస్యంగా ఉంచడం జరుగుతుందని, అందువల్ల ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని అన్నారు. జిల్లాలో ఎస్‌.కోట, బొబ్బిలి, రాజాం ప్రాంతాల్లో ఎయిడ్స్‌ వ్యాధిగ్రస్తులు ఎక్కువగా ఉన్నారని తెలిపారు. ఇతర జిల్లాలతో పోలిస్తే, జిల్లాలో ఎయిడ్స్‌ వ్యాధిగ్రస్తుల సంఖ్య తక్కువేనని చెప్పారు. ఎయిడ్స్‌ నియంత్రణకు తీసుకున్న చర్యలు, అవగాహనా కార్యక్రమాలు సత్ఫలితాలను ఇస్తున్నాయని జెసి తెలిపారు. కార్యక్రమంలో డిఎంహెచ్‌ఒ డాక్టర్‌ ఎస్‌.భాస్కరరావు, జిల్లా ఎయిడ్స్‌ నియంత్రణాధికారి డాక్టర్‌ కె.రాణి, ఇతర అధికారులు, సిబ్బంది, ఎఎన్‌ఎంలు, ఆశాలు, విద్యార్థినులు పాల్గొన్నారు.హెచ్‌ఐవి బాధితులతో సహపంక్తి భోజనంహెచ్‌ఐవి బాధితులు, ట్రాన్స్‌ జెండర్ల పట్ల సమాజంలో వివక్షత పోగొట్టి సమాజంలో ఇతరులతో కలసి జీవించేందుకు అనువైన పరిస్థితులు ఏర్పరచే లక్ష్యంతో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఒక వినూత్న కార్యక్రమాన్ని చేపట్టింది. ప్రపంచ ఎయిడ్స్‌ దినోత్సవాన్ని లెట్‌ కమ్యూనిటీస్‌ లీడ్‌ అనే నినాదంతో ఈ ఏడాది నిర్వహిస్తున్న సందర్భంగా జిల్లాలోని హెచ్‌ఐవి బాధితులు, ట్రాన్స్‌జెండర్లతో శుక్రవారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో సహపంక్తి భోజనం ఏర్పాటు చేశారు. డిఎంహెచ్‌ఒ ఎస్‌.భాస్కరరావు, జిల్లా క్షయ, కుష్టు, ఎయిడ్స్‌ నియంత్రణ అధికారి డాక్టర్‌ కె.రాణి, జిల్లా సమాచార పౌరసంబంధాల అధికారి డి.రమేష్‌ తదితరులు పాల్గొని వారితో కలసి భోజనం చేశారు. ఈ సందర్భంగా డిఎంహెచ్‌ఒ వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. సమాజంలో వారూ ఒక భాగమే, వారికి సమాజం తోడ్పాటు వుంటుందని చెప్పేందుకే ఈ ప్రయత్నం చేశామని తెలిపారు. కార్యక్రమంలో డిప్యూటీ డిఎంహెచ్‌ఒ డాక్టర్‌ ఎన్‌.సూర్యనారాయణ, ఇమ్యూనైజేషన్‌ అధికారి డాక్టర్‌ ఆర్‌.అచ్యుత కుమారి, పొజిటివ్‌ నెట్‌వర్క్‌ సంస్థ ప్రతినిధి పద్మ, ట్రాన్స్‌జెండర్ల సంఘం అధ్యక్షురాలు మీనాకుమారి, నాగమణి తదితరులు పాల్గొన్నారు.విజయనగరం టౌన్‌ : ఎయిడ్స్‌ దినాన్ని పురస్కరించుకొని ఇండియన్‌ రెడ్‌ క్రాస్‌ సొసైటీ ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో యువతకు శుక్రవారం అవగాహన కార్యక్రమాన్ని చేపట్టారు. రెడ్‌ క్రాస్‌ సెక్రటరీ కె.సత్యం, రెడ్‌ క్రాస్‌ మెడికల్‌ ఆఫీసర్‌ సి.హెచ్‌. వేణుగోపాల్‌ రెడ్డి మాట్లాడారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ జనార్ధన నాయుడు, వైస్‌ ప్రిన్సిపాల్‌ సుభా, యూత్‌ రెడ్‌క్రాస్‌ కోఆర్డినేటర్‌ ఎస్‌.రామకృష్ణ, ఎన్‌ఎస్‌ఎస్‌ కోఆర్డినేటర్‌ శ్రీనివాసరావు, రెడ్‌ క్రాస్‌ జిల్లా ప్రోగ్రాం కోఆర్డినేటర్‌ డి.గౌరీశంకర్‌, విద్యార్థులు పాల్గొన్నారు.బాడంగి : ఎయిడ్స్‌పై విద్యార్థులు అవగాహన ర్యాలీ, మానవహారం చేపట్టారు. ఎయిడ్స్‌పై చైతన్యానికి, అవగాహనకు యువత సామాజిక మాధ్యమాలను వినియోగించుకోవాలని డాక్టర్‌ విశ్వనాథ్‌ సూచించారు. కార్యక్రమంలో ఎయిడ్స్‌ కౌన్సిలర్‌ భానుమూర్తి, జూనియర్‌ కళాశాల ప్రిన్సిపల్‌ శంకర్‌రావు పాల్గొన్నారు.నెల్లిమర్ల : కొండవెలగాడలో పిహెచ్‌సి వైద్యాధికారి ధనుంజరు, శిరీష ఆధ్వర్యాన ఎయిడ్స్‌పై అవగాహన ర్యాలీ జరిగింది. కార్యక్రమంలో పిహెచ్‌సి సిబ్బంది పాల్గొన్నారు.వేపాడ : ప్రభుత్వ జూనియర్‌ కాలేజీలో ప్రిన్సిపల్‌ కిలపర్తి అప్పారావు ఆధ్వర్యంలో ఎయిడ్స్‌పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో పిఒ కె.బి.బాబు, అధ్యాపకులు మూర్తి, తదితరులు పాల్గొన్నారు.పూసపాటిరేగ : ఎయిడ్స్‌లేని సమాజ స్థాపనకు అందరూ కృషి చేయాలని పూసపాటిరేగ పిహెచ్‌సి వైద్యులు రాజేష్‌వర్మ, ప్రమీలాదేవి, లక్ష్మి సైజలా అన్నారు. ప్రపంచ ఎయిడ్స్‌ దినోత్సవం సందర్భంగా శుక్రవారం గ్రామంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో వైద్య సిబ్బంది రమణ, ఉమాపతి, బంగారుబాబు, ఎఎన్‌ఎం అసిరితల్లి, జూనియర్‌ కళాశాల విద్యార్ధులు పాల్గొన్నారు. గజపతినగరం : హెచ్‌ఐవిపై అవగాహన అవసరమని గజపతినగరం ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్‌ జగదీష్‌ తెలిపారు. ఎయిడ్స్‌ డే సందర్భంగా ఆస్పత్రి ఆవరణలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో ఆసుపత్రి వైద్య సిబ్బంది పాల్గొన్నారు.వంగర : ప్రపంచ ఎయిడ్స్‌ దినోత్సవం సందర్భంగా వివేక మాస్టర్‌ మైండ్‌ పాఠశాల విద్యార్థులు ప్రిన్సిపల్‌ బెవర ఈశ్వరరావు ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు చక్రపాణి, కొండేటి శ్రీనివాసరావు, శంకరరావు తదితరులు పాల్గొన్నారు.బొబ్బిలి : అవగాహనతో ఎయిడ్స్‌ను నివారించవచ్చునని రోటరీ క్లబ్‌ అధ్యక్ష, కార్యదర్శులు జెసి రాజు, వి.శ్రీహరి, కోశాధికారి శ్రీనివాస్‌ అన్నారు. ప్రపంచ ఎయిడ్స్‌ దినోత్సవం సందర్భంగా శుక్రవారం ప్రభుత్వ బాలికల వసతి గృహంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎయిడ్స్‌ అంటువ్యాధి కాదని, జాగ్రత్తగా ఉంటే నివారించవచ్చునని తెలిపారు.

➡️