ఫొటో : ఎస్మా జిఒ పతులను దగ్ధం చేస్తున్న అంగన్వాడీలు
ఎస్మా జిఒ పతులు దగ్ధం
ప్రజాశక్తి-అనంతసాగరం : అంగన్వాడీలు తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ 28వ రోజు సోమవారం ఐసిడిఎస్ కార్యాలయం వద్ద నిరవధిక సమ్మె చేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకుండా ఎస్మా చట్టాన్ని అంగన్వాడీలపై విధించడం దుర్మార్గమని అంగన్వాడీలు పేర్కొన్నారు. ఈ మేరకు చట్టం జిఒలను రద్దు చేసి అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలని ఎస్మా చట్టం జిఒ నెంబర్2 ప్రతులను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా సిఐటియు మండల కార్యదర్శి అన్వర్ బాషా మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అంగన్వాడీల సమస్యలు పరిష్కరించి, వేతనాలు పెంచి గ్రాడ్యుటీని అమలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని, ఎస్మా లాంటి చట్టాలను అంగన్వాడీలపై విధించి ఉద్యోగాల నుండి తొలగిస్తామని బెదిరించడం సరికాదన్నారు. అంగన్వాడీలు చేస్తున్న సమ్మె చట్టబద్ధమైన సమ్మె అని రాష్ట్రంలో లక్షమంది అంగన్వాడీలు ఉన్నారని వారిని ఏ విధంగా తొలగిస్తారని ప్రశ్నించారు. వారిని తొలగించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదన్నారు. ఇప్పటికైనా అంగన్వాడీల రాష్ట్ర నాయకులతో చర్చలు జరిపి న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. పలు రాష్ట్రాల్లో అంగన్వాడీలకు కనీస వేతనాలు పెంచి గ్రాడ్యుటీని కూడా అమలు చేస్తున్నారన్నారు. జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర సందర్భంగా అంగన్వాడీలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలన్నారు. కనీస వేతనం పెంచే వరకు సమ్మె కొనసాగుతుందన్నారు. కార్యక్రమంలో జెవివి రాష్ట్ర కమిటీ సభ్యులు వేము పెంచలయ్య, ఐసిడిఎస్ అనంతసాగరం ప్రాజెక్టు అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ నాయకులు సునీత, సుబ్బమ్మ, భాగ్యమ్మ, తదితర అంగన్వాడీలు పాల్గొన్నారు.
![ఫొటో : ఎస్మా జిఒ పతులను దగ్ధం చేస్తున్న అంగన్వాడీలు](https://prajasakti.com/wp-content/uploads/2024/01/anantha.png)