ప్రజాశక్తి- శృంగవరపుకోట: ప్రతి ఒక్క యువ ఓటర్ ఓటు వేసి 2024లో నియోజకవర్గాన్ని రక్షించాలని టిడిపి రాష్ట్ర కార్యదర్శి గొంప కృష్ణ కోరారు. శనివారం పట్టణంలోని టిడిపి కార్యాలయంలో నియోజకవర్గంలోని కొత్త ఓటర్లుతో ఆయన బేటి అయ్యారు. అనంతరం గొంప కృష్ణ మాట్లాడుతూ మీరు వేసే ఓటు మీ వ్యక్తిగత జీవితాన్ని శాసిస్తుందని గుర్తించుకోవాలన్నారు. ప్రజాధనాన్ని దోచుకుతింటున్న వైసిపిని తిప్పికొట్టి, నిజమైన పాలన అందించే సత్తా ఉన్నవారికే ఓటు వేయాలని కోరారు. నేరచరితులు, భూకబ్జాదారులు ఎన్నికల్లో పోటీచేస్తూ కోట్లు వెదజల్లుతుండటం, మంచి రాజకీయాన్ని ఎదగనీయకుండా చేసేందుకు బురదజల్లటం బాధకలిగిస్తోందన్నారు. ఈ పరిస్థితుల్ని మార్చగలిగే అవకాశం, బాధ్యత పూర్తిగా మీ చేతుల్లోనే ఉందని, ‘ఓటు’ అనే ఆయుధం ద్వారానే మార్పును సాధించగలమని అన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు రాయవరపు చంద్రశేఖర్, జుత్తాడ రామసత్యం, ఆడారి ఉమామహేశ్వర రావు, గనివాడ సన్యాసినాయుడు, మాదిబోయిన మంగరాజు, మతల ఎర్రినాయుడు, బంగారు నాయుడు, ఇందుకూరి శ్రీనిరాజు, తదితరులు పాల్గొన్నారు.
![](https://prajasakti.com/wp-content/uploads/2024/01/SKT-GOMPA-2.jpg)