కలెక్టరేట్‌ ఎదుట పెన్షనర్ల ధర్నా

Jan 29,2024 20:19

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ :  అపరిష్కృతంగా ఉన్న సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ ఎపి పెన్షనర్ల అసోసియేషన్‌ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్‌ ఎదుట సోమవారం ధర్నా చేశారు. ఈ సందర్భంగా పెన్షనర్ల అసోసియేషన్‌ అధ్యక్షులు పెద్దింటి అప్పారావు మాట్లాడుతూ 11వ పిఆర్‌సిలో 2022 నుంచి తగ్గించిన అడిషినల్‌ క్వాంటమ్‌ను తిరిగి యథావిధిగా అంతకు ముందు ఇస్తున్నట్లు 70ఏళ్లు నిండిన వారికి 10శాతం, 75 ఏళ్లు నిండిన వారికి 15శాతానికి పునరుద్దరించాలని డిమాండ్‌ చేశారు. పెండింగ్‌లో ఉన్న డిఆర్‌ బకాయిలను వెంటనే విడుదల చేయాలన్నారు. 11వ పిఆర్‌సి ఎరియర్స్‌ వెంటనే చెల్లించాలని డిమాండ్‌ చేశారు. హెల్త్‌ కార్డు ద్వారా అన్ని వ్యాధులకు అన్ని గుర్తింపు పొందిన ఆస్పత్రుల్లో వైద్య సేవలు అందించాలని కోరారు. మెడికల్‌ రీ-ఇంబర్స్మెంట్‌ పరిధి 2 లక్షల నుండి 5 లక్షలకు పెంచాలని డిమాండ్‌ చేశారు. ధర్నాలో పెన్షనర్ల సంఘం జిల్లా కార్యదర్శి, జి.నారాయణరావు, రాష్ట్ర ఉపాధ్యక్షులు జిఆర్‌ రాఘవ రాజు, తాలుక యూనిట్‌ అధ్యక్షుడు వి.సూర్య నారాయణ, కార్యదర్శి సిహెచ్‌ త్రినాథ ప్రసాద్‌, వి.సత్తి రాజు తదితరులు పాల్గొన్నారు.

➡️