ఫొటో : మాట్లాడుతున్న జిల్లా అంగన్వాడీ అండ్ హెల్పర్స్ వర్కర్స్ యూనియన్ కార్యదర్శి రెహనాబేగం
కొనసాగుతున్న అంగన్వాడీల నిరవధిక సమ్మె
ప్రజాశక్తి-ఆత్మకూరు అర్బన్ : రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడీలు వివిధ రూపాలలో ఆందోళన కొనసాగిస్తున్నారు. తమన్యాయమైన సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సమాన పనికి సమాన వేతనం రూ.26వేలు అంగన్వాడీ కార్యకర్తలకు, హెల్పర్లకు ఇవ్వాల్సిందేనని జిల్లా అంగన్వాడీ అండ్ హెల్పర్స్ వర్కర్స్ యూనియన్ కార్యదర్శి రెహనాబేగం పేర్కొన్నారు. శనివారం పట్టణంలోని ఐసిడిఎస్ కార్యాలయం ఎదుట రిలే నిరాహార దీక్ష చేపట్టారు. వారికి మద్దతుగా జిల్లా అంగన్వాడీ అధ్యక్ష కార్యదర్శులు రెహనా బేగం, సుజాతమ్మ రిలే నిరాహార దీక్షలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంగన్వాడీ కార్యకర్తలు ఇచ్చే రూ.11,500 జీతంతో కుటుంబాన్ని పోషించుకోలేక అవస్థలు ఎదుర్కొంటున్నారని, వారు అడిగిన కోరికలను రాష్ట్ర ప్రభుత్వం తీర్చకపోగా సచివాలయం సిబ్బందితో అంగన్వాడీ తాళాలు పగలగొట్టి విధులు నిర్వహించడం సరైన పద్ధతి కాదన్నారు. ఇకనైనా వారు స్పందించి అంగన్వాడీ సమస్యలను వెంటనే పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. ముందుగా అంగన్వాడీ కార్యకర్తలకు అంగన్వాడీ యూనియన్ నాయకురాలు పి.రాధమ్మ, సిఐటియు మండల అధ్యక్షులు ఆత్మకూరు నాగయ్య, జిల్లా కౌలు రైతుసంఘం నాయకులు గంటా లక్ష్మీపతి మాట్లాడారు. అంగన్వాడీ కార్యకర్తలకు పూలమాలలేసి రిలే నిరాహార దీక్షను ప్రారంభించారు. కార్యక్రమంలో సిఐటియు గౌరవాధ్యక్షులు సిపిఎం పట్టణ కార్యదర్శి డేవిడ్ రాజు, అంగన్వాడీ సెక్టార్ లీడర్లు కామేశ్వరీ, జమీల, విజయలక్ష్మి, విజయమ్మ, మస్తానమ్మ, పద్మావతి, శ్రీదేవి, రూతమ్మ, వెంకట రమణమ్మ, విజయభారతి, భాగ్యలక్ష్మి, నాలుగు మండలాల అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్లు, తదితరులు పాల్గొన్నారు.
![ఫొటో : మాట్లాడుతున్న జిల్లా అంగన్వాడీ అండ్ హెల్పర్స్ వర్కర్స్ యూనియన్ కార్యదర్శి రెహనాబేగం](https://prajasakti.com/wp-content/uploads/2023/12/atk-2-2.jpg)