అమలాపురంలో విద్యార్థులకు బహుమతులు అందజేస్తున్న జెసి
ప్రజాశక్తి-అమలాపురం
కలెక్టరేట్ లోని స్పందన హాలులో జిల్లా వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో జాతీయ వినియోగదారుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా జాయింట్ కలెక్టర్ నుపూర్ అజరు పాల్గొని వినియోగదారుల హక్కులు బాధ్యతలపై జిల్లాలోని విద్యార్థులు, ప్రజలకు అవగాహన కల్పించారు. సమావేశంలో తొలుత డ్రగ్ కంట్రోలర్, ఆహార భద్రత శాఖ,లీగల్ మెట్రోలజీ శాఖ సిబ్బంది స్టాల్స్ ఏర్పాటు చేసి ప్రజలు ఉపయోగించే మందులు కొనుగోలు, తినుబండారాలు, డిజిటల్ లావాదేవీలు తదితర వాటి గురించి తీసుకోవలసిన ముందస్తు జాగ్రత్తలను కార్యక్రమానికి హాజరైన విద్యార్థులకు ,ప్రజలకు వివరించారు. అనంతరం జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ… వస్తు సేవల వినియోగదారులకు వినియోగదారుల రక్షణ చట్టం ఒక కవచం లాంటిదని అన్నారు. వినియోగ దారులు వారికీ సంబందించిన హక్కులు తెలుసుకోవడం చాలా అవసరమన్నారు. ఈ చట్టం కింద పిర్యాదులు ఇవ్వాలంటే రూ.5 లక్షల వరకు ఎటువంటి ఫీజు అవసరం లేదన్నారు. విద్యార్థులు జాగో భారత్ జాగో వంటి కార్యక్రమాల ద్వారా వినియోగదారుల హక్కుల గురించి అవగాహన పెంపొందించుకోవచ్చన్నారు . ఈ కార్యక్రమం లో భాగంగా ఏర్పాటు చేసిన స్టాల్స్లో కల్తీ ఆహార పదార్థాలను గుర్తించడం ,తూనికలు లో జరిగే మోసాలు తదితరాల గురించి అవగాహన పెంపొందించుకుని, వారి కాలనీల్లో ,గ్రామాలలో ప్రజలకు అవగాహన కల్పించాలని విద్యార్థుల కు సూచించారు. జిల్లాస్థాయిలో స్కూల్స్, కళాశాలల్లోని ద్యార్థులకు వినియోగదారుల హక్కుల పై అవగాహన మీద నిర్వహించిన వక్తృత్వం, క్విజ్ పోటీల్లో విజేతలకు జెసి నగదు బహుమతి ప్రదానం చేశారు.కార్యక్రమం లో జిల్లా పౌర సరఫరాల అధికారి ఎ.పాపారావు, , తూనికలు కొలతల అధికారి రాజేష్, వివిధ వినియోగదారుల సంఘ ప్రతినిధులు, పౌర సరఫరాల డిప్యూటీ తహశీల్దార్లు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు . మండపేట మండపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్స్, డిపార్ట్ర్ట్మెంట్ ఆఫ్ కామర్స్ సంయుక్తంగా ఆధ్వర్యంలో వినియోగదారుడా మేలుకో అనే నినాదంతో జాతీయ వినియోగదారుల హక్కుల దినోత్సవాన్ని శనివారం నిర్వహించారు. ఈ సందర్బంగా కళాశాల ప్రిన్సిపల్ డా. టికెవి.శ్రీనివాసరావు మాట్లాడుతూ డిజిటల్ ఆన్లైన్ విధానంలో మోసాలను వినియోగదారుడు తనకున్న హక్కుల ద్వారా వస్తువు నాణ్యతను భద్రతను కాపాడుకోగలరని అన్నారు. ప్రజలకు అవగాహన కల్పించడంలో భాగంగా విద్యార్థులు ర్యాలీ కార్యక్రమం చేపట్టారు. కార్యక్రమంలో అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు.