ప్రజాశక్తి-కొత్తవలస : రోమన్ కేథలిక్ లు అమితంగా పూజించే కొండడాబా వ్యాకులమాత జాతర ఆదివారం ఘనంగా జరిగింది. కొత్తవలస మండల కేంద్రానికి సుమారు ఏడు కిలోమీటర్లు దూరంలో కొండడాబాలు వద్ద వెలసిన వ్యాకులమాత పుణ్యక్షేత్ర యాత్ర మత సామరస్యానికి ప్రతీకగా నిలిచింది. శనివారం నుంచి భక్తులు లక్షలాదిగా వచ్చారు. రెండు రోజులు జరిగే ఈ యాత్రకు భక్తులు రాష్ట్రం నలుమూలల నుంచే కాక, ఇతర రాష్ట్రాల నుంచి కూడా తరలివచ్చారు. కొండడాబాలు విచారణ కర్త గొంగాడ రాజు, ఉత్సవ కమిటీ సభ్యులు, జాతర ప్రాంగణంలో భక్తులకు అసౌకర్యం కలగకుండా తగిన ఏర్పాట్లు చేశారు. శనివారం విశాఖపట్నం జ్ఞానాపురం నుంచి మహా పాదయాత్ర ప్రారంభమైంది. ఆదివారం ఉదయం 4 గంటల నుంచి యాత్రికులు కొండకు చేరుకున్నారు. గురువులు జొన్నాడ జాన్ ప్రకాష్, కోన జయరాజు, డాక్టర్ మల్లవరం ప్రకాష్, జొన్నాడ జాన్ ప్రకాష్, చిటికెల రాజ్కుమార్ ఆధ్వర్యాన పూజలు నిర్వహించారు. జాతరలో భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా, ప్రశాంతంగా నిర్వహించడానికి 150 మంది పోలీసు సిబ్బందితో గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు సిఐ వి. చంద్రశేఖర్ తెలిపారు.
![](https://prajasakti.com/wp-content/uploads/2024/02/ktv.jpeg.jpg)