ప్రజాశక్తి -పార్వతీపురంరూరల్ : రాష్ట్రంలో టిడిపి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బిసిలే వెన్నెముకగా నిలిచిన చరిత్ర ఉందని టిడిపి నియోజకవర్గ ఇన్ఛార్జి బోనెల విజయచంద్ర అన్నారు. శనివారం టిడిపి నియోజకవర్గ కార్యాలయంలో ఆయన అధ్యక్షతన నిర్వహించిన జయహో బిసి సదస్సులో వక్తలు మాట్లాడారు. వైసిపి అధికారంలోకి వచ్చిన తర్వాత బిసిలను తుంగలో తొక్కిందన్నారు. తమ హయాంలో అమలు చేసిన పథకాలన్నీ నిలిపివేసి, బిసి కార్పొరేషన్ను నిర్వీర్యం చేసి, వారిని మోసం చేశారని అన్నారు. బిసిలను విడగొట్టి కులాలుగా కార్పొరేషన్లు ఏర్పాటు చేసినప్పటికీ వాటికి విధులు, నిధులు లేకుండా చేశారని తెలిపారు. కార్పొరేషన్ చైర్మన్లను దిష్టిబొమ్మలుగా మార్చిన చరిత్ర వైఎస్ జగన్మోహన్ రెడ్డిదేనని విమర్శించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్పర్సన్ ద్వారపురెడ్డి శ్రీదేవి, టిడిపి అరకు పార్లమెంటు ఉపాధ్యక్షులు గొట్టాపు వెంకట్నాయుడు, ఐటిడిపి కోఆర్డినేటర్ బార్నాల సీతారాం పట్టణ ప్రధాన కార్యదర్శి మజ్జి వెంకటేష్, బిసి సెల్ నియోజకవర్గ అధ్యక్షులు రవి, మండల అధ్యక్షులు బోను దేవి చంద్రమౌళి, ప్రధాన కార్యదర్శి గొరజాన చంద్రమౌళి, నాయకులు పోలా సత్యనారాయణ, ఐటిడిపి అధ్యక్షులు కోరాడ నారాయణ రావు, పార్టీ పట్టణ అధ్యక్షులు గుంట్రేరెడ్డి రవి కుమార్, డాక్టర్ గరిమెళ్ళ భాను ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.