ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్: ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం ఓటరు దరఖాస్తులను పరిష్కరించాలని ఆర్డీవో చిన్నయ్య, ఏఈఆర్వో కమిషనర్ డాక్టర్ జె.అరుణ చెప్పారు. ఓటరు దరఖాస్తుల పరిశీలన, పరిష్కారం అంశాలపై బిఎల్ఓలతో సోమవారం నగరపాలక కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఈఆర్ఓ, కమిషనర్ మాట్లాడుతూ.. పోలింగ్ కేంద్రాల పరిధిలో పెండింగ్లో ఉన్న ఫారం- 6, 7, 8, 8ఎ దరఖాస్తులను సత్వరం పూర్తి చేయాలన్నారు. దరఖాస్తుల ఆమోదం, తిరస్కరణకు సంబంధించి అనుబంధ డాక్యుమెంట్లను కచ్చితంగా పొందుపరచాలని మొత్తం దరఖాస్తులు, సంబంధిత ధవపత్రాలను ఒకటిగా ఫైల్ చేయాలన్నారు. దరఖాస్తుల పరిశీలనలో ఎన్నికల కమిషన్ నిర్దేశించిన మార్గదర్శకాలను కచ్చితంగా పాటించాలన్నారు. ఎన్నికల ప్రక్రియలో ఎలాంటి పొరబాట్లకు తావు లేకుండా చూడాలన్నారు. తప్పులు లేని తుది ఓటర్ల జాబితా తయారీ కోసం జాగ్రత్తగా విధులు నిర్వహించాలన్నారు. సూపర్వైజర్ ఆఫీసర్లు వారి పరిధిలోని బిఎల్వోలను సమన్వయం చేసుకొని దరఖాస్తుల ప్రక్రియ సక్రమంగా, సవ్యంగా జరిగేలా పర్యవేక్షించాలని ఆదేశించారు. కార్యక్రమంలో సీఎంఎం గోపి, సూపర్వైజర్ అధికారులు, బిఎల్వోలు పాల్గొన్నారు.
![](https://prajasakti.com/wp-content/uploads/2024/03/ctr-RDO.jpg)