ప్రజాశక్తి -యంత్రాంగం భీమునిపట్నం : తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యాన జివిఎంసి ఒకటో జోన్ కార్యాలయం ఎదుట పారిశుధ్య కార్మికులు బుధవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా జివిఎంసి ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ (సిఐటియు) గౌరవాధ్యక్షులు ఆర్ఎస్ఎన్.మూర్తి మాట్లాడుతూ, పారిశుధ్య, ఇతర విభాగాల కార్మికుల డిమాండ్లను పరిష్కరించాలని, లేకుంటే ఆందోళన తీవ్రతరం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు రవ్వ నరసింగరావు, రాజు, శ్రీను, సురేష్ తదితరులు పాల్గొన్నారు. పిఎం పాలెం : రాష్ట్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా మున్సిపల్ కార్మికులు మధురవాడ జోనల్ కార్యాలయం వద్ద మోకాళ్లపై నిల్చుని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా యూనియన్ జిల్లా ఉప ప్రధాన కార్యదర్శి ఎంవి.ప్రసాద్ మాట్లాడుతూ, గత ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలను అమలుచేయకుండా అన్యాయం చేశారన్నారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు సిహెచ్.శేషుబాబు, జి.కిరణ్, బి.నర్సింగరావు, క్లాప్ డ్రైవర్స్ యూనియన్ నాయకులు కె.సన్ని, ఎస్.చిన్న, ఎ.అశోక్, సిఐటియు నాయకులు డి.అప్పలరాజు పాల్గొన్నారు. గాజువాక : పారిశుధ్య కార్మిక సమస్యలు పరిష్కరించకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని సిఐటియు నాయకులు ఎం రాంబాబు, జివిఎంసి కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ నాయకులు గొలగాని అప్పారావు రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ మేరకు గాజువాక సిఐటియు కార్యాలయంలో బుధవారం సాయంత్రం కార్మికులతో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాము, నక్క నాగరాజు, గణేష్, కె.కిరీటం, మీనాక్షి, కుమారి, వై.చిన్నారావు పాల్గొన్నారు. ఆరిలోవ : జివియంసి కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ (సిఐటియు) ఆధ్వర్యాన మున్సిపల్ పారిశుధ్య కార్మికులు ఆరిలోవ కాలనీలోని సీవేజ్ ప్లాంట్ వద్ద ఆందోళన చేశారు. సమస్యలు పరిష్కరించాలంటూ ఒప్పంద పారిశుధ్య కార్మికులు పెద్ద ఎత్తున నినదించారు. చెత్తను సేకరించే వాహనాలను బయటకు పోకుండా అడ్డుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా మున్సిపల్ యూనియన్ డిప్యూటీ ప్రధాన కార్యదర్శి ముద్దాడ వర ప్రసాదరావు, సిఐటియు నాయకులు శంకరరావు, బి.రత్నం, గణపతి, కనకరాజు, ఈశ్వరరావు, రాజశేఖర్, భవాని తదితరులు పాల్గొన్నారు.అనకాపల్లిలో వంటావార్పు అనకాపల్లి : తమ సమస్యల పరిష్కారానికి నిరవధిక సమ్మె చేస్తున్న మున్సిపల్ కార్మికులు బుధవారం రెండోరోజున అనకాపల్లిలోని జీవిఎంసి జోనల్ కార్యాలయం వద్ద వంట వార్పు నిరసన చేపట్టారు. ఈసందర్భంగా కార్మిక యూనియన్ గౌరవ అధ్యక్షులు గంటా శ్రీరామ్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు కాంట్రాక్ట్ వర్కర్లు అందరినీ పర్మినెంట్ చేయాలని, క్లాప్ డ్రైవర్లకు నైజ18,500 వేతనం ఇవ్వాలని, ఇంజనీరింగ్ వాటర్ వర్క్స్ ,పార్కుల్లో పనిచేసే మున్సిపల్ కార్మికులకు హెల్త్ అలవెన్సులు మంజూరు చేయాలని, పర్మినెంట్ ఉద్యోగుల లీవ్ ఎన్ కాస్మెంట్ ,సరెండర్ లీవులు జిపిఎఫ్ సమస్యలు పరిష్కారం చేయాలని కోరారు. సిఐటియు జిల్లా అధ్యక్షులు ఆర్ శంకనరావు, మున్సిపల్ యూనియన్ గౌరవ అధ్యక్షులు గంటా శ్రీరామ్, మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ నాయకులు బొమ్మాల రాము, ఎర్రంశెట్టి ఏసురాజు ,అజరు కుమార్, నూకరాజు,శివ పాల్గొన్నారు. నర్సీపట్నం టౌన్:తమ సమస్యలు పరిష్కరిం చాలని మున్సిపల్ కార్మికులు చేస్తున్న సమ్మె రెండో రోజు బుధవారం కొనసాగింది. ఈ సందర్భంగా నర్సీపట్నం ఎన్టీఆర్ స్టేడియం వద్ద నిరసన తెలిపారు. అనంతరం మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ (సిఐటియ) నర్సీపట్నం ప్రెసిడెంట్ బొర్రా శ్రీనివాసరావు మాట్లాడుతూ, నర్సీపట్నం మున్సిపాలిటీలో మున్సిపల్ కార్మికులు సుమారు 100 మంది వరకు పని చేస్తున్నారని, వారికి పర్మినెంట్ చేస్తామని ఇచ్చిన హామీ నెరవేర్చలేదన్నారు. కరోనాలో కార్మికులు ప్రాణాలు తెగించి అందిస్తే తొలగించడం అన్యాయమన్నారు. ఇప్పటికైనా సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కేవిజిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఈరెల్లి చిరంజీవి, మున్సిపల్ కార్మికలు కుపరాల రాజు, దేముడు, కుమార్ తదితర్లు పాల్గొన్నారు.