ఫొటో : మాట్లాడుతున్న పింఛను అందజేస్తున్న ఎంఎల్ఎ మేకపాటి విక్రమ్రెడ్డి
పేదరిక నిర్మూలనే జగనన్న లక్ష్యం
ప్రజాశక్తి-ఆత్మకూరు అర్బన్ : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన పాలనలో పేదరిక నిర్మూలనే లక్ష్యంగా పనిచేశారని, ప్రతి ఒక్కరికీ ఆర్థిక ప్రోత్సాహాం అందిస్తూ వారు మరింత ప్రగతి సాధించేలా చర్యలు తీసుకున్నారని ఎంఎల్ఎ మేకపాటి విక్రమ్ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం ఆత్మకూరులోని ఎంపిడిఒ కార్యాలయం వద్ద ఆత్మకూరు రూరల్, మున్సిపల్ పరిధిలో వైఎస్ఆర్ పింఛన్ కానుక పెంపు ఉత్సవంలో ఎంఎల్ఎ మేకపాటి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఎంఎల్ఎకు స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పలువురు పింఛను లబ్ధిదారులకు అధికారులు, నాయకులు, ప్రజాప్రతినిధులతో కలసి ఎంఎల్ఎ మేకపాటి పింఛను కానుకను అందజేశారు. అనంతరం ఎంఎల్ఎ మేకపాటి విక్రమ్రెడ్డి మాట్లాడుతూ జగనన్న నాలుగున్నర సంవత్సరాల పాలనలో ప్రతి సామాజికవర్గానికి ఆర్థికంగా అభివృద్ధి చేశారని, సంక్షేమ పథకాల ద్వారా వారిని ప్రోత్సహించారని వివరించారు. 60 సంవత్సరాలు దాటిన వృద్ధుల కోసం పింఛను నగదును ప్రతి సంవత్సరం రూ.250పెంచుతూ ఈ సంవత్సరం రూ.3వేలు అందచేస్తూ వారికి ఆర్థిక భరోసా కల్పిస్తున్నారన్నారు. అవ్వాతాతలు ఇబ్బందులు పడకుండా ప్రతినెలా 1వ తేదీ ఇంటికి వచ్చి పించను అందజేసే వలంటీర్ వ్యవస్థను ముఖ్యమంత్రి తీసుకొచ్చారని, దాంతో ఎలాంటి ఇబ్బంది లేకుండా పింఛన్లు వారి అందుతున్నాయని, నాలుగున్నర సంవత్సరాల పాటు ఇది గమనించిన ప్రతిపక్ష పార్టీలు వారిపై అనవసర ఆరోపణలు చేశారని, ప్రజలంతా వలంటీర్ వ్యవస్థకే మద్దతుగా నిలిచారన్నారు. టిడిపి, జనసేన పార్టీలు పదేపదే వలంటీర్లపై ఆరోపణలు చేస్తూ పదిసార్లు చెబితే అబద్ధం నిజమవుతుందని భావించారని, నిస్వార్థంగా సేవ చేస్తున్న వలంటీర్లపై ఇలా ఆరోపణల చేసి ఆ వ్యవస్థను రద్దు చేసి మళ్లీ పింఛను కానుక తమ రాజకీయ అవసరాలకు వినియోగించాలని చూస్తున్నారని, అలాంటి వారికి మళ్లీ అవకాశం ఇస్తే అవ్వాతాతలు ఇబ్బందులు పడాల్సి వస్తుందన్నారు. జగనన్న ప్రవేశపెట్టిన సచివాలయ వ్యవస్థ ద్వారా గ్రామ స్వపరిపాలన సాధ్యమైందని, ఆ వ్యవస్థ ద్వారా జిల్లా, మండల కేంద్రాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ప్రజలకు ప్రభుత్వ సేవలు అందుతున్నాయని, రిజిస్ట్రేషన్ సేవలు కూడా అందుబాటులోకి వస్తాయన్నారు. జగనన్న ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు అందుకున్న ప్రతిఒక్కరూ తమ గ్రామంలోని వారికి వివరించాలని, మళ్లీ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గెలిపించుకునేలా అందరం సమిష్టిగా కృషి చేస్తామని ఎంఎల్ఎ మేకపాటి పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆర్డిఒ కె.మధులత, ఎంపిపి కేత వేణుగోపాల్ రెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ గోపారం వెంకట రమణమ్మ, వైస్చైర్మన్లు షేక్ సర్దార్, డాక్టర్ శ్రావణ్ కుమార్, జెసిఎస్ కన్వీనర్ డాక్టర్ సిహెచ్ ఆదిశేషయ్య, పార్టీ పట్టణ అధ్యక్షులు అల్లారెడ్డి ఆనంద్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ బి.నాగేశ్వరరావు, ఎంపిడిఒ ఐజాక్ ప్రవీణ్, కౌన్సిలర్లు రమాదేవి, తిరుపతమ్మ, నౌషాద్ బేగం, కామాక్షయ్య నాయుడు, మహబూబ్ బాషా, పడమేకల పెంచలయ్య, సిండికేట్ ఫార్మర్ సొసైటీ చైర్మన్ సానా వేణుగోపాల్ రెడ్డి, వైసిపి నాయకులు ఐవి రమణారెడ్డి, నోటి వినరు కుమార్ రెడ్డి, చిన్నపరెడ్డి, సయ్యద్ జమీర్, రహీం, తదితరులు పాల్గొన్నారు.
![ఫొటో : మాట్లాడుతున్న పింఛను అందజేస్తున్న ఎంఎల్ఎ మేకపాటి విక్రమ్రెడ్డి](https://prajasakti.com/wp-content/uploads/2024/01/atk-3-scaled.jpg)