ప్రజాశక్తి – రామభద్రపురం : పేదోడి సొంతింటి కల సాకారమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే శంబంగి వెంకట చిన అప్పలనాయుడు అన్నారు. పేదలందరికీ ఇల్లు కార్యక్రమంలో భాగంగా సోమవారం మండల కేంద్రానికి చెందిన లబ్ధిదారులకు ఆయన చేతులమీదుగా ఇళ్ళు పట్టాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఇల్లు లేని పేదవాళ్లు ఉండకూడదని మొదటి విడతగా 31 లక్షల ఇళ్లను లబ్ధిదారులకు సిఎం మంజూరు చేశారని తెలిపారు. పేద ప్రజల అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని గత ప్రభుత్వాల మాదిరి మాటలు చెప్పి మాయ చేసే ప్రభుత్వం తమది కాదని అన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పిటిసి అప్పికొండ సరస్వతి, తహశీల్దార్ సులోచనారాణి, మండల పార్టీ అధ్యక్షులు అప్పికొండ లక్ష్యుంనాయుడు తదితరులు పాల్గొన్నారు.వంగర: వైసిపితోనే పేద ప్రజల సంక్షేమం సాధ్యమని ఎంపిపి ఉత్తరావెల్లి సురేష్ ముఖర్జీ అన్నారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో 110 మందికి ఆయన చేతుల మీదుగా సోమవారం ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదవాడికి గూడు కూడు విద్య వైద్యం వైసిపి ధ్యేయమని అన్నారు. ఈ కార్యక్రమంలో వైసిపి మండల అధ్యక్షులు కరణం సుదర్శనరావు, తహశీల్దార్ సుధాకర్, ఎంపిడిఒ సుబ్రహ్మణ్యం, ఆర్ఐ జామి మురళి, మహిళ సమాఖ్య అధ్యక్షులు కే భగవతి తదితరులు పాల్గొన్నారు.
![](https://prajasakti.com/wp-content/uploads/2024/02/rbpm-mla.jpg)