ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : మున్సిపల్ ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ యుటిఎఫ్ ఆధ్వర్యాన శుక్రవారం సాయంత్రం కలెక్టరేట్ వద్ద ఉపాధ్యాయులు ధర్నాచేశారు. సాయంత్రం 5.30 గంటలు నుంచి 8 గంటల వరకు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా యుటిఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి జెఎవిఅర్కె ఈశ్వరరావు మాట్లాడుతూ దీర్ఘకాలంగా ఉన్న సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలన్నారు. ఉపాధ్యాయులకు పిఎఫ్ సౌకర్యం కల్పించాలని, బకాయిలు చెల్లించాలని, మెడికల్ రీయింబర్స్ మెంట్ బిల్లులకు దరఖాస్తు చేసుకొనే అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కారం కాకపోతే ఈనెల 22న జిల్లా స్థాయి సదస్సు, డిసెంబర్ 30న విజయవాడ లో ధర్నా చేపడతామని తెలియజేశారు. ధర్నాలో జిల్లా ఆడిట్ కమిటీ సభ్యులు పొట్టా శ్రీనివాసరావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కె.విజయగౌరి, రాష్ట్ర కౌన్సిలర్ డి. రాము, కె.శ్రీనివాసరావు, జిల్లా కోశాధికారి సిహెచ్ భాస్కర్ రావు మాట్లాడారు. జిల్లా కార్యదర్శులు కె. ప్రసాదరావు, పి. త్రినాథ్, సిహెచ్ తిరుపతి నాయుడు, జి.రాజారావు జిల్లా ఆడిట్ కమిటీ కన్వీనర్ ఎ.శంకరరావు, సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.