ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : నగర పాలక సంస్థ కౌన్సిల్ రూ.158.75 కోట్ల తో 20024-25కు బడ్జెట్ ను ప్రవేశపెట్టి ఆమోదించింది. మంగళవారం నగర పాలక సంస్థ మేయర్ వెంపడాపు విజయలక్ష్మి అధ్యక్షతన కౌన్సిల్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా బడ్జెట్ను కౌన్సిల్ ఏకగ్రీవంగా ఆమోదించింది. సుమారు రూ.81.47 కోట్లతో నగర అభివృద్ధి పనులకు నిధులు కేటాయించారు. ముఖ్యంగా రూ.12 కోట్ల సాధారణ నిధులతో కొత్తగా రహదారుల నిర్మానం, రూ5కోట్ల బిపిఎస్ నిధులతో అభివృద్ధి పనులు, రూ.12 కోట్లు 15వ ఆర్థిక సంఘం నిధులతో అభివృద్ధి పనులు, రూ.1కోటితో సచివాలయాల పక్కా భవనాల నిర్మాణం చేపట్టేందుకు కౌన్సిల్ ఆమోదించింది. రూ.2కోట్లతో ప్రాధమిక ఆరోగ్య కేంద్రాల నిర్మాణం, రూ.1.50 కోట్లతో హార్టికల్చర్, పట్టణ సుందరీకరణ, రూ.6 కోట్ల సాధారణ నిధులుతో మురుగు కాలువలు, కల్వర్టుల నిర్మాణానికి కౌన్సిల్ ఆమోదం తెలిపింది. రూ.1.50 కోట్లతో సెంట్రల్ లైటింగ్, పార్కుల లైటింగ్, రూ.1.50 కోట్లతో పార్క్స్ అండ్ ప్లే గ్రౌండ్స్ అభివృద్ధి పనులు, 80 లక్షలతో కమ్యూనిటీ టాయిలెట్స్ నిర్మాణం, రూ.2.50 కోట్లతో నీటి సరఫరా పైపు లైన్ల నిర్మాణం చేపట్టాలని తీర్మానించారు. అనంతరం జరిగిన అత్యవసర కౌన్సిల్ సమావేశంలో ఆరు అంశాలతో కూడిన అజెండాలో మూడింటిని ఆమోదించి, మూడు అంశాలను వాయిదా వేశారు. సమావేశంలో డిప్యూటీ మేయర్లు లయా యాదవ్, కోలగట్ల శ్రావణి, కమిషనర్ శ్రీరాములు నాయుడు, అసిస్టెంట్ కమిషనర్ ప్రసాదరావు, ప్లోర్ లీడర్ రాజేష్ కార్పొరేటర్లు, నగర పాలక సంస్థ అధికారులు పాల్గొన్నారు.
![](https://prajasakti.com/wp-content/uploads/2023/12/mayar-2-1.jpg)