ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ గురువారం ఎపి జెఎసి అధ్వర్యంలో నల్ల రిబ్బన్లు కట్టుకొని కలెక్టరేట్ ఎదుట నిరసన ధర్నా నిర్వహించారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎపి ఎన్జిఒ రాష్ట్ర ఉపాధ్యక్షులు డి.వి రమణ మాట్లాడుతూ రాష్ట్ర జెఎసి పిలుపు మేరకు లంచ్ అవర్లో జెఎసి భాగ్యస్వామ్య పక్ష ఉద్యోగులు, ఉద్యోగ సంఘ నాయకులు తమ న్యాయమైన డిమాండ్ల సాధనకై ఆందోళనలు చేపట్టినట్లు తెలిపారు. ముఖ్యంగా ఐ అర్ 30 శాతం, పెండింగ్ డిఎలు, జిపిఎఫ్, ఎపిజిఎల్ఐ బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. ఈనెల 17న తాలూకా కేంద్రాల్లో ర్యాలీలు, ధర్నాలు, 20న జిల్లా కేంద్రాల్లో ర్యాలీ, ధర్నా 27న చలో విజయవాడ కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు. ప్రభుత్వం ఇప్పటికైనా ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లు పరిష్కారానికి తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు. జెఎసి జిల్లా నాయకులు సురేష్, రాష్ట్ర ఉపాధ్యక్షులు డివి రమణ , పింఛనుదార్ల సంఘం ప్రధాన కార్యదర్శి నారాయణ, పంచాయతీరాజ్ మినిస్ట్రీరియల్ ఉద్యోగుల సంఘం అధ్యక్ష కార్యదర్శులు మురళి, రాంబాబు, ఇరిగేషన్ ఉద్యోగుల సంఘం జిల్లా నాయకులు వై ఆనంద్ కుమార్, ఎన్జీవో జిల్లా,పట్టణ కార్యవర్గ సభ్యులు నాయకులు నీలాద్రి నాయుడు, శ్రీధర్ బాబు,తవుడు,అప్పలనాయుడు విద్యాశాఖ వ్యవసాయ శాఖ స్త్రీ శిశు సంక్షేమ శాఖ నాయకులు మహిళా విభాగం అదిలక్ష్మి ,శ్రీ విద్య, స్వప్న పాల్గొన్నారు.
బొబ్బిలి : ఉద్యోగ, ఉపాధ్యాయ, పింఛనుదారులకు ప్రభుత్వం చెల్లించాల్సిన 25 వేల కోట్ల రూపాయల బకాయిలను తక్షణమే విడుదల చేయాలని జెఎసి నాయకులు జె.సి.రాజు డిమాండ్ చేశారు. బొబ్బిలి తాలూకా జెఎసి కార్యదర్శి జి.రామారావు ఆధ్వర్యంలో గురువారం భోజన విరామ సమయంలో స్థానిక ఇరిగేషన్ ఎస్ఇ కార్యాలయం వద్ద నిరసన చేపట్టారు. 17న తాలూకా కేంద్రాల్లో నిర్వహించనున్న ర్యాలీ, ధర్నాను విజయవంతం చేయాలని జెఎసి నాయకులు జి.రామారావు కోరారు. కార్యక్రమంలో జలవనరుల శాఖ సూపరింటెండెంట్ ఎం.సురేష్కుమార్, సతీష్ కుమార్, శ్రీలత, జెఎసి నాయకులు బంకురు ప్రసాద్, చుక్క శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు.
డెంకాడ : మస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ రెండో రోజు ఉద్యోగులు నిరసన వ్యక్తం చేశారు. భోగాపురం తాలుకా యూనిట్ పరిధిలో డెంకాడ ఎంపిపి కార్యాలయం ముందు నల్ల బ్యాడ్జీలు ధరించి మధ్యాహ్న భోజన సమయంలో నిరసన తెలిపారు. కార్యక్రమంలో భోగాపురం తాలూకా అధ్యక్షులు కొమ్మూరు దుర్గారావు, అసోసియేషన్ అధ్యక్షుడు జగదీశ్, ఉద్యోగ ప్రతినిధులు కె. గురుభక్తులు, కె యేసయ్య.. సీత రాజు, వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.