ప్రజాశక్తి – కాకినాడ
ఓటర్ల జాబితా సంక్షిప్త సవరణ -2024 భాగంగా ఇప్పటివరకు ఫారం 6, 7, 8 ద్వారా 1,07,063 దరఖాస్తులు వచ్చాయని కాకినాడ సిటీ నియోజకవర్గ ఇఆర్ఒ, నగరపాలక సంస్థ కమిషనర్ సిహెచ్.నాగ నరసింహారావు తెలిపారు. మంగళవారం కార్పొరేషన్ కార్యాలయంలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఫారం 6, 7, 8 ద్వారా వచ్చిన దరఖాస్తుల ప్రగతిని ఇఆర్ఒ వివరించారు. వచ్చిన దరఖాస్తుల్లో దాదాపు 83,276 పరిష్కరించామని, 9790 దరఖాస్తులను వివిధ కారణాల వల్ల తిరస్కరించామని చెప్పారు. వచ్చిన ప్రతి ఒక్క దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్లు తెలిపారు. ఓటరు ప్రత్యేక శిబిరంలో వచ్చిన దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిష్కరించేలా ఆదేశాలు ఇచ్చామన్నారు. పారదర్శకమైన ఓటర్ల జాబితాను రూపొందించడంలో రాజకీయ పార్టీల ప్రతినిధులు కూడా సహకరించాలని విజ్ఞప్తి చేశారు. లక్షకు పైగా దరఖాస్తుల స్వీకరణతోపాటు పరిష్కారంలో కాకినాడ సిటీ నియోజకవర్గం మెరుగైన స్థానంలో ఉందన్నారు. కొేత్త ఓటర్ల నమోదు, నాన్ ట్రేస్డ్ ఓటర్లకు సంబంధించి రిజిస్టర్ పోస్ట్ ద్వారా పంపించిన నోటీసుల వివరాలు, మార్పులు చేర్పులకు సంబంధించిన సమాచారాన్ని వివరించారు. ఈ సమావేశంలో రావూరి వెంకటేశ్వరరావు(వైసిపి), తుమ్మల రమేష్, గదుల సాయిబాబా (టిడిపి ), అప్పారావు (బిఎస్పి), రాంబాబు(అమ్ ఆద్మీ), ఎఇఆర్ఒలు సీతాపతి రావు, మురళీకృష్ణ, హరిదాసు, నాగశాస్త్రులు, సిబ్బంది పాల్గొన్నారు.