కో ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి నియంతృత్వ ధోరణికి వ్యతిరేకంగా విజయనగరం నియోజకవర్గ టిడిపి, జనసేన, బిజెపి ఉమ్మడి అభ్యర్ధి పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు విజయానికి తామంతా కృషి చేస్తామని వైసిపి నాయకులు, అర్బన్ బ్యాంకు మాజీ అధ్యక్షులు కాళ్ల గౌరీ శంకర్ ప్రకటించారు. మంగళవారం తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. విజయనగరంలో తొలిసారిగా వైసిపి జెండా పట్టుకున్న ఆవనాపు కుటుంబాన్ని పార్టీ నుంచి బయటకు పంపించే విధంగా కోలగట్ల పొగ పెట్టారని, ప్రశాంతంగా ఉండే ప్రాంతాల్లో కత్తులతో దాడి వంటి విష సంస్కతిని కోలగట్ల ప్రోత్సహించా రని అన్నారు. తనకు నచ్చని వారిని తప్పుడు కేసుల్లో ఇరికించే దుర్బుద్ధితో వ్యవహరించారని గౌరీ శంకర్ ఆరోపించారు. కార్పొరేషన్ కార్యాలయాన్ని, మండల కార్యాలయాన్ని కబ్జా చేసిన ఘనుడు ఎమ్మెల్యే అని ఘాటు విమర్శలు చేసారు. కుళాయి కనెక్షన్ కావాలన్నా, మ్యూటేషన్ జరగాలన్నా ఎమ్మెల్యే ప్రమేయం తప్పని సరైందని ఆవేదన వ్యక్తం చేశారు. తాము వైయస్ రాజశేఖర్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి అభిమానులమైనప్పటికీ ఎమ్మెల్యే నియంతృత్వ పోకడలను నిరసిస్తూ రానున్న ఎన్నికల్లో విజయనగరం నియోజకవర్గంలో అదితి విజయలక్ష్మి విజయానికి కృషి చేస్తామని తెలిపారు. సమావేశంలో కాళ్ల గౌరి శంకర్ అనుచరులు కనకల సత్యనారాయణ, హంస శ్రీనివాసరావు, ఎడ్ల కాంతారావు, గలావిల్లి గోపి, తాలాడగిరి, కరుబుక్త సురేష్, తాలాడ సురేష్, కాళ్ళ సురేష్ తదితరులు పాల్గొన్నారు.
![](https://prajasakti.com/wp-content/uploads/2024/03/kaalla.jpg)