రసాభాసగా మున్సిపల్ కౌన్సిల్ సమావేశం
ప్రజాశక్తి-నర్సీపట్నం టౌన్ : స్థానిక మున్సిపల్ కౌన్సిల్ సమావేశం అధికార, విపక్ష కౌన్సిలర్ల వాగ్వాదం, తోపులాటలతో రసాభాసగా జరిగింది. మంగళవారం మున్సిపల్ చైర్పర్సన్ బోడపాటి సుబ్బలక్ష్మి అధ్యక్షతన జరిగిన సమావేశంలో అభివృద్ధిపై జరిగిన చర్చ వాగ్వాదంతో మొదలై, అయ్యన్న తనయుడు 25 వార్డు కౌన్సిలర్ రాజేష్, మున్సిపల్ వైస్చైర్మన్ కోనేటి రామకృష్ణ మధ్య వాదులాట తీవ్రమైంది. కొత్తవీధి రోడ్డు నిర్మాణంలో నాణ్యత లోపించిందని టిడిపి కౌన్సిలర్ మధు ప్రస్తావించగా, దీనిపై రగడ చెలరేగింది. ఇరుపార్టీల కౌన్సిలర్లు బాహాబాహీగా దిగగా, కొందరు అడ్డుగా నిలబడి వారించారు. మున్సిపల్ చైర్పర్సన్ సుబ్బలక్ష్మి పోడియం దిగి కౌన్సిలర్ల మధ్యకు వచ్చి సమావేశం సజావుగా సాగేలా చూడాలని కోరారు. ప్రజాసమస్యలపై ప్రశ్నిస్తే అడ్డుతగలడం, దాడులకు దిగడం వైసిపి కౌన్సిలర్లకు తగదని, ప్రశ్నిస్తే కొట్టేందుకు వస్తారా అంటూ చైర్పర్సన్ సుబ్బలక్ష్మిని 26వ వార్డు కౌన్సిలర్ చింతకాయల పద్మావతి నిలదీశారు. సౌకర్యాలు కల్పించకుండా టిడ్కో ఇళ్లను పంపిణీ చేయడం ఎన్నికల స్టంట్గా టిడిపి కౌన్సిలర్లు ఎద్దేవా చేశారు. ఆద్యంతం గొడవలతో సమస్యలపై ఎటువంటి చర్చ లేకుండా మున్సిపల్ సమావేశం అర్థాంతరంగా ముగిసింది.
పరస్పర దాడులకు సిద్ధమైన కౌన్సిలర్లు