ప్రజాశక్తి-తాడిపత్రి (అనంతపురం జిల్లా) : అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఆదివారం రాత్రి ఓ టిడిపి కార్యకర్త సోమవారం దారుణహత్యకు గురయ్యారు. ఈ ఘటనతో ్ ఒక్కసారిగా తాడిపత్రిలో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇందుకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం… తాడిపత్రి పట్టణం నందలపాడుకు చెందిన లాల్బాషా అలియాస్ లాలు (30) టిడిపి కార్యకర్తగా ఉన్నారు. ఆదివారం రాత్రి ఇంటిపై నిద్రిస్తున్న ఆయనను గుర్తుతెలియని వ్యక్తులు చాకుతో గొంతు కోసి హత్య చేశారు. సోమవారం ఉదయం లాలు తల్లి నిద్ర లేపడానికి వెళ్లి చూడగా ఆయన రక్తపు మడుగులో విగతజీవిగా పడి ఉన్నారు. డిఎస్పి జనార్థన్ నాయుడు, పట్టణ సిఐ నాగేంద్రప్రసాద్ సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. కుటుంబ సభ్యులతో మాట్లాడి వివరాలను తెలుసుకున్నారు. లాల్బాషాపై గతంలో పలు పోలీసు కేసులు ఉన్నాయని డిఎస్పి తెలిపారు. ఈ నేపథ్యంలో వ్యక్తిగత ఘర్షణల కారణంగానే ప్రత్యర్థులు హత్యకు పాల్పడి ఉండవచ్చని ప్రాథమికంగా నిర్ధారించామన్నారు. ఘటనపై పూర్తి స్థాయి దర్యాప్తు చేసి నిందితులను త్వరలోనే పట్టుకుంటామని తెలిపారు.
![](https://prajasakti.com/wp-content/uploads/2023/12/hatya.jpg)