పిడిఎఫ్ మాజీ ఎంఎల్సి విఠపు బాలసుబ్రహ్మణ్యం
ప్రజాశక్తి – కాకినాడ ప్రతినిధి
విద్యారంగ పరిరక్షణకు ఎస్ఎఫ్ఐ భవిష్యత్లో మరిన్ని పోరాటాలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని పిడిఎఫ్ మాజీ ఎంఎల్సి విఠపు బాలసుబ్రహ్మణ్యం అన్నారు. 24వ రాష్ట్ర మహాసభలో ఆయన ప్రారంభ ఉపన్యాసమిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ, ఎయిడెడ్ కళాశాలలు బతికి ఉన్నాయంటే అది ఎస్ఎఫ్ఐ పొరటాల ఫలితమేనన్నారు. నూతన విద్యా విధానానికి వ్యతిరేకంగా సమరశీలంగా పోరాడుతున్న సంఘం ఎస్ఎఫ్ఐ అన్నారు. చదువు అనేది వెనుకబాటు తనం, దోపిడీ, ఆజ్ఞానం, అన్యాయం నుంచి బయటకి తెచ్చేదిగా ఉండాలన్నారు. విద్యార్థులు ప్రశ్నించే తత్వాన్ని అలవర్చుకోవాలన్నారు. విద్యార్థులు చదువుకోవాలని, సైన్స్ కోసం తెలుసుకోవాలని కందుకూరి వీరేశలింగం చెప్పారని గుర్తు చేశారు. నూతన విద్యా విధానం వల్ల జరుగుతున్న నష్టాలను ఆయన వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా 12 వేల స్కూళ్లు మూతబడ్డాయన్నారు. ఖాళీ టీచర్ పోస్టులు భర్తీ కావడం లేదన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యా రంగాన్ని నిర్వీర్యం చేసే విధానాలను అమలు చేస్తుండడం బాధాకరమన్నారు. నానాటికీ విద్యా ప్రమాణాలు దిగజారుతున్నా ప్రభుత్వాలకు పట్టడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎపిలో నాణ్యమైన చదువులు కరువయ్యాయన్నారు.