విద్యార్థులు రాష్ట్రానికి పేరు తేవాలి : బొత్స

Feb 4,2024 20:18

 ప్రజాశక్తి-చీపురుపల్లి : విద్యార్థులు బాగా చదువుకొని రాష్ట్రానికి, తల్లితండ్రులకు గొప్ప పేరు తేవాలని రాష్ట్ర విద్యా శాఖా మంత్రి బొత్స సత్యనారాయణ కోరారు. కేజీ నుంచి పీజీ వరకు, ప్రపంచస్థాయి ప్రమాణాలతో ప్రభుత్వం రాష్ట్రంలో అత్యున్నత విద్యను అందిస్తోందని, దానిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సుమారు రూ.8 కోట్లతో నిర్మించిన గద్దే బాబూరావు ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాల నూతన భవనాన్ని ఆయన ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి బొత్స మాట్లాడుతూ, విద్యార్థులు విద్యాభ్యాసం జరుగుతున్న సమయంలోనే జీవితానికి ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలని సూచించారు. అభివృద్ధి చెందాలనే తపన ముఖ్యమని ఆయన స్పష్టం చేశారు . కళాశాలలో నెలకొన్న సమస్యలపై మంత్రి ప్రిన్సిపాల్‌ ఎల్‌. విజయలక్ష్మిని అడిగి తెలుసుకున్నారు. కళాశాలలో కావలసిన మౌలిక వసతులు అంశాలపై విద్యార్ధులను మంత్రి ఆరా తీసారు. ఈ సందర్భంగా విద్యార్ధులు మాట్లాడుతూ అద్యాపకుల కొరతతో పాటు ల్యాబ్‌ సదుపాయం, ప్లేస్‌మెంటులను ఏర్పాటు చేయాలని విద్యార్థులు కోరారు. స్పందించిన మంత్రి వాటికి సంబంధించిన నివేదికలను తక్షణమే తయారు చేసి తీసుకురావాలని ప్రిన్సిపాల్‌కు సూచించారు. ప్రస్తుతం కళాశాలలో మెకానికల్‌, ఎలక్ట్రికల్‌ కోర్సులు మాత్రమే ఉన్నాయని, వచ్చే విద్యా సంవత్సరం నుంచి కంప్యూటర్‌ సైన్స్‌, సివిల్‌ కోర్సులను మంజూరు చేసేందుకు చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. కళాశాలకు అదనపు ఫ్యాకల్టీ, ఆఫీస్‌ స్టాఫ్‌, హాస్టల్‌ మంజూరు చేస్తామని, క్యాంపస్‌ రిక్రూట్మెంట్‌ సౌకర్యాన్ని పెంచుతామని చెప్పారు. ఎంపి బెల్లాన చంద్రశేఖర్‌ మాట్లాడుతూ, కళాశాల చరిత్ర, అభివద్ధి చెందిన విధానాన్ని వివరించారు. తన ఎంపి నిధులు రూ.10 లక్షలతో కళాశాల ప్రాంగణంలో అథ్లెటిక్‌ ట్రాక్‌ ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. సాంకేతిక విద్య ప్రిన్సిపల్‌ సెక్రటరీ సురేష్‌ కుమార్‌ మాట్లాడుతూ, సాంకేతిక నిపుణులకు అపార ఉద్యోగ అవకాశాలున్నాయని చెప్పారు. మాజీ ఎమ్మెల్యే గద్దె బాబురావు, ఎంపిపి ప్రతినిధి ఇప్పిలి అనంత్‌, కళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ ఎల్‌.విజయలక్ష్మి, పలువురు విద్యార్థులు మాట్లాడారు. కార్యక్రమంలో జాయింట్‌ కలెక్టర్‌ కె.కార్తీక్‌, అసిస్టెంట్‌ కలెక్టర్‌ వెంకట్‌ త్రివినాగ్‌, ఆర్‌జెడి సత్యనారాయణ మూర్తి, ఆర్‌డిఒ బి. శాంతి, ఎంపిపి. ఐ.వెంకట నరసమ్మ, జెడ్‌పిటిసి వి.శిరీష, తాహశీల్దర్‌ ఎన్‌.ప్రసాదరావు, ఎంపిడిఒ డి.శ్వేత, సర్పంచ్‌ మంగళగిరి సుధారాణి, అధికారులు, ప్రజా ప్రతినిధుల పాల్గొన్నారు.

గ్రామాల్లో మూడు దేవాలయాలను నిర్మించాం

ప్రతీ గ్రామ పంచాయతీలోను సచివాలయం, రైతు భరోసా కేంద్రం, విలేజ్‌ హెల్త్‌ క్లినిక్‌ల వంటి మూడు దేవాలయాలను నిర్మాంచామని రాష్ట్ర మంత్రి బొత్స సత్యన్నారాయణ అన్నారు. పేరిపి గ్రామంలో 23 లక్షల వ్యయంతో విలేజ్‌ హెల్త్‌ క్లినిక్‌, రూ.22 లక్షలతో రైతుభరోసా కేంద్రం, రూ.44 లక్షలతో నిర్మించిన గ్రామ సచివాలయ భవనాలను మంత్రి బొత్స సత్యన్నారాయణ ప్రారంభించారు. ప్రజలకు ఏ ఇబ్బందులు తలెత్తినా మండల కేంద్రంలో ఉన్న కార్యాలయాలకు పరుగుతు తీయకుండా గ్రామంలోనే అన్ని సమస్యలు పరిష్కరించేలా ఏర్పాట్లను ప్రభుత్వం చేసిందన్నారు. తాము మంచి చేసామంటేనే తమను ఆదరించండని మంత్రి కోరారు. అనంతరం ప్రజలకు పట్టాలు అందజేసారు. కార్యక్రమంలో అధికారులతో పాటు సర్పంచ్‌ కోరాడ పృద్వి, అగ్రికల్చర్‌ మండల ఛైర్మన్‌ కోరాడ నారాయణరావు, అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

➡️