మూడు నెలలుగా నిలిచిన మధ్యాహ్న భోజనం
ఖాళీ కంచాలతో తల్లిదండ్రులతో కలిసి నిరసన
ప్రజాశక్తి -అనంతగిరి : మూడునెలలుగా మధ్యాహ్న భోజనం నిలిచిపోయి, తామంతా ఆకలితో అలమటిస్తున్నా అధికారులు స్పందించడం లేదని మండలంలోని మారుమూల పిన్నకోట పంచాయతీ పూతికపుట్టు ఎంపిపి పాఠశాల విద్యార్థులు మంగళవారం ఖాళీ కంచాలతో నిరసన చేపట్టారు. పాఠశాలలో 33 మంది విద్యార్థులున్నారని,అన్ని పాఠశాలల్లో అమలవుతుంటే, తమ పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని ఎందుకు నిలుపుదల చేశారో చెప్పాలని విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చేపట్టారు. దీనిపై ఎంఇఒ బాలాజీ వివరణ కోరగా, మండలంలోని 135 పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం నిలిచిపోయిందని, దీనిపై ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లామన్నారు. ఆందోళనలో విద్యార్థుల తల్లిదండ్రులు ఎస్ కొండబాబు, భవాని శంకర్, లక్ష్మి, రాములమ్మ పాల్గొన్నారు
ఖాళీ కంచాలతో నిరసన వ్యక్తం చేస్తున్న గిరిజన విద్యార్థులు