ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా 500 కిలోమీటర్లు నిర్వహించిన సైకిల్ యాత్రలో గుర్తించిన సమస్యలు పరిష్కారం చేయాలని ఎస్ఎఫ్ఐ చేస్తున్న పోరాటం నేటికి విజయవంతమైంది. జిల్లా విద్యాశాఖ అధికారులతో జిల్లా కలెక్టర్ సమావేశాలు నిర్వహించి ఆ సమస్యల పరిష్కారానికి కషి చేస్తున్నారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష , కార్యదర్శులు సిహెచ్ వెంకటేష్, పి.రామ్మోహన్ మాట్లాడుతూ పోరాటమే సరైన మార్గం అని చెప్పిన ఎస్ఎఫ్ఐ నినాదం నేడు రుజువైందని హర్షం వ్యక్తం చేశారు. జిల్లావ్యాప్తంగా విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఆయా మండల కమిటీలు ఈపాటికే పలు దఫాలుగా అనేక ఆందోళనలు నిర్వహించి, రెండుసార్లు కలెక్టరేట్ ముట్టడించి అనంతరం అంతిమ ప్రయత్నంగా నిరవదిక నిరాహార దీక్షలకు దిగి తమ సమస్యలు పరిష్కారం చేసుకున్నారని, ఇది విద్యార్థుల విజయమని కొనియాడారు. అదే సందర్భంలో ఈ సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక చొరవ చూపించిన జిల్లా విద్యాశాఖ అధికారులందరికీ , వీరందరినీ సమన్వయం చేసి హామీలను నెరవేర్చిన జిల్లా కలెక్టర్కు పత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఇదే స్ఫూర్తితో విద్యా రంగంలో ఇతర సమస్యలపై ఎస్ఎఫ్ఐ చేసే పోరాటాలకు విద్యార్థులు సన్నద్ధం కావాలని తెలిపారు.
![](https://prajasakti.com/wp-content/uploads/2023/12/sfi-5.jpg)