ప్రజాశక్తి – ముదినేపల్లి
విధుల పట్ల వైద్య సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పని ఎంపిపి ఆర్.సత్యనారాయణ అన్నారు. ముదినేపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అభివృద్ధి కమిటీ సమావేశం మంగళవారం సాయంత్రం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన ఆయన మాట్లాడుతూ ఆసుపత్రి సిబ్బంది సమయపాలన పాటిస్తూ ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ వైద్య సేవలందించాలన్నారు. విధులపట్ల నిర్లక్ష్యం వహించే వారిపై ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి చర్యలు తీసుకుంటామన్నారు. ఆసుపత్రిని సందర్శించి వైద్య సిబ్బంది సేవలపై రోగులను అడిగి తెలుసుకున్నారు. సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. ఈ సమావేశంలో మండల పార్టీ అధ్యక్షులు మొట్రూ ఏసుబాబు, పిహెచ్సి వైద్యాధికారులు, ఎఎన్ఎంలు, సిబ్బంది పాల్గొన్నారు.