ప్రజాశక్తి-కడప వివేకానందరెడ్డిని హత్య చేసిన వ్యక్తికి సునీత మద్దతు ఇవ్వడం బాధాకరంగా ఉందని కమలాపురం ఎమ్మెల్యే పి.రవీంద్రనాథ్రెడ్డి అన్నారు. గురువారం కడపలోని వైసిపి జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ హత్య వెనుక ఎవరున్నారనేది అందరికీ బాగా తెలుసన్నారు. చంద్రబాబు వీరి వెనుక ఉండి రాజకీయాలు చేయాలనుకుంటున్నారన్నారు. చంద్రబాబు అండ్ కో వివేకా హత్య కేసుతో సంబంధం ఉందని చెప్పారు. వివేకా హత్య కేసులో నిందితుడికి సునీత మద్దతు ఇవ్వడం బాధాకరమన్నారు. తాను నేరుగా నేనే చంపాను అంటున్న అతనికి మద్దతు ఇచ్చి బెయిల్ కూడా ఇప్పించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. దీని వెనుకల ఎవరున్నారు అనేది ప్రజలకు బాగా తెలుసన్నారు. టిడిపి ప్లాన్తో వివేకా హత్య జరిగిందన్నారు. దస్తగిరి స్వయంగా హత్య చేశానని ఒప్పుకున్నాడన్నారు. దస్తగిరికి బెయిల్ వచ్చేదానికి టిడిపి ప్రమేయం కూడా ఉందన్నారు. టిడిపికి జనసేన, బిజెపితో ప్రత్యక్షంగా పొత్తు, పరోక్షంగా కాంగ్రెస్తో బాబుకు పోత్తుందన్నారు. ఎన్ని పార్టీలు ఏకమైన వెసిపిని ఏమి చేయలేరని తెలిపారు. సమావేశంలో వైసిపి నాయకులు పులి సునీల్ కుమార్ పాల్గొన్నారు.