ప్రజాశక్తి-మెంటాడ : మరో 40 రోజుల్లో వైసిపి నాయకులు గొర్రెల్ని కాసుకోవడమేనని టిడిపి పొలిట్బ్యూరో సభ్యులు జి.సంధ్యారాణి వ్యాఖ్యానించారు. మండలంలోని జయతి గ్రామంలో బాబు షూరిటీ – భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా టిడిపి రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆర్.పి.భంజ్దేవ్తో కలిసి ఇంటింటికీ వెళ్లి సూపర్ సిక్స్ పథకాల గురించి వివరించారు. ఈ సందర్భంగా సంధ్యారాణి మాట్లాడుతూ నరకాసుర పాలనకు అంతమొందే రోజులు ఎంతో కాలం లేదన్నారు. ఈ ఏడాది రాష్ట్ర ప్రజలకు రెండుసార్లు దీపావళి జరుపుకొనే అవకాశం కలిగిందన్నారు. అనంతరం భంజ్దేవ్ మాట్లాడుతూ సాలూరు నియోజక వర్గం అవినీతిమయంగా మారిందన్నారు. ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలంటే టిడిపి అభ్యర్థి సంధ్యారాణిని ఎమ్మెల్యేగా గెలిపించు కోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని చెప్పారు. టిడిపి టికెట్ ఖరారైన తరువాత మొదటి సారి మండలానికి వచ్చిన సంధ్యారాణికు అపూర్వ ఆదరణ లభించింది. ఈ సందర్భంగా వైసిపి, బిజెపి నుంచి 30 కుటుంబాలు టిడిపిలో చేరాయి. వారికి సంధ్యారాణి కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు చలుమూరి వెంకట రావు, జి.అన్నవరం, జి.ముసలి నాయుడు, రామచంద్రుడు, ఎస్.నారంనాయుడు, పి.రామ లింగేశ్వరరావు, రెడ్డి ఎర్నాయుడు, డి.అనిల్, గుమ్మిడి సింహాచలం, రెడ్డి సత్యనారాయణ, రాజగోపాల్, మనిపూరి రమణమ్మ పాల్గొన్నారు.
![](https://prajasakti.com/wp-content/uploads/2024/03/mtd.jpg)