ప్రజాశక్తి -అనకాపల్లి
జిల్లాలో వ్యవసాయ అభివృద్ధిలో ఆరుతడి పంటలు కీలకమని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం పరిశోధన సహసంచాలకులు డాక్టర్ పివికే జగన్నాధరావు పేర్కొన్నారు. స్థానిక ఆర్ఏఆర్ఎస్లో శనివారం శాస్త్రవేత్తలు, వ్యవసాయ అధికారులు, అభ్యుదయ రైతులతో జరిగిన శిక్షణ సందర్శన కార్యక్రమంలో ఆయన ముఖ్యవక్తగా మాట్లాడారు. ఆరుతడి పంటలైన మినుము, పెసర, నువ్వులు జనుము, మొక్కజొన్న పంట పంటలు స్వల్ప కాలంలో తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆదాయం సంపాదించవచ్చని చెప్పారు. జిల్లా వ్యవసాయ శాఖ ప్రతినిధి శ్రీధర్ మాట్లాడుతూ ఖరీఫ్లో సరైన వర్షపాతం నమోదు కాకపోవడంతో దాని ప్రభావం రబీపై పడి దిగుబడులు తగ్గుతున్నాయన్నారు. కొక్కిరాపల్లి వ్యవసాయ పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఎ.అప్పలస్వామి మాట్లాడుతూ తమ పరిశోధన స్థానం నుంచి విడుదలైన వైఎల్ఎం 66 నువ్వుల రకం ఉపయోగించి సరైన యాజమాన్య పద్ధతులు పాటించడం ద్వారా ఎకరాకు ఎనిమిది క్వింటాళ్ల దిగుబడులు సాధించవచ్చని పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా ఉద్యానవన శాఖ అధికారి ప్రభాకర్రావు, వ్యవసాయ శాస్త్రవేత్తలు విశాలాక్షి రామలక్ష్మి, రమణమూర్తి, ఉమామహేశ్వరరావు, వ్యవసాయ సబ్ డివిజన్ల ఏడీఏలు పాల్గొన్నారు.