ప్రజాశక్తి – గుంటూరు జిల్లాప్రతినిధి, పల్నాడు జిల్లా : సంక్రాంతి సంబరాల్లో భాగంగా గుంటూరు, నరసరావుపేటలో ప్రభుత్వం ఆధ్వర్యంలో ఆది, సోమవారాలు వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రత్యేకంగా సాంస్కృతిక కార్యమ్రకాలు ఏర్పాటు చేశారు. గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్యర్యంలో ఎన్టిఆర్ స్టేడియంలో సినీ గాయకులు దామిని, శ్రీకృష్ణ, హారికా నారాయణ్, ఉమా నేహా, రవి జాకీ, డిటియస్ ఆనంద్తో స్టార్ మ్యూజికల్ మస్తి డాన్స్ హంగామా నిర్వహించారు. రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి విడదల రజిని, జిల్లా కలెక్టర్ ఎం.వేణుగోపాల్రెడ్డి, ఎంపి అయోధ్య రామిరెడ్డి, ప్రభుత్వ విప్ లేళ్ల అప్పిరెడ్డి, మేయర్ కావటి శివనాగ మనోహర్ నాయుడు అధికారులు, ప్రజా ప్రతినిధులు, ప్రజలు భారీగా పాల్గొన్నారు. పల్నాడు జిల్లా కేంద్రం నరసరావుపేటలోని క్రీడా ప్రాంగణంలో సినీ సంగీత దర్శకులు రఘు కుంచె, సుంమంత్ సునంద ఆధ్వర్యంలో సంగీత విభావరి ఆలరించింది. జబర్దస్త్ బృందం ఇమ్మానుయేల్, శాంతి స్వరూప్, గడ్డం నవీన్, చిత్రం శ్రీను తమ ప్రదర్శనలతో సందడి చేశారు. ప్రత్యేకంగా డాన్స్ ప్రోగ్రాం అలరించింది, రష్యన్ క్విక్, చేంజ్ డాన్స్ ప్రోగ్రాం, కల్చరల్ ప్రోగ్రామ్స్, చిన్నారుల డాన్సులు అలరించాయి. చిన్నారుల శివుని నృత్య ప్రదర్శన, డంబుల్స్ డాన్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. పల్నాడు జిల్లాకు సంబంధించి లేజర్ షో ఆకట్టుకుంది. వందేళ్లకు పైబడిన వారిని, క్రీడల్లో రాణించిన వారిని జిల్లా కలెక్టర్ ఎల్.శివశంకర్ సత్కరించారు. కార్యక్రమంలో కలెక్టర్ శివశంకర్ దంపతులు, ట్రైనీ కలెక్టర్ కల్పశ్రీ, డిఆర్ఒ వినాయకం, పట్టణ ప్రజలు పాల్గొన్నారు.